విశాఖపట్నంలోని ఉడా కాలనీ సచివాలయంలోని ఇద్దరు వాలంటీర్లు కనిపించకుండా పోయారు. నగరంలోని పీఎం పాలెం పరిధిలో మిథిలాపురి ఉడా కాలనీ సచివాలయంలో ఈ ఇద్దరు వాలంటీర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు పెళ్లైన మహిళ కాగా, మరో వ్యక్తి యువకుడు. ఈ ఇద్దరు వాలంటీర్లు గత కొద్దికాలం నుంచి ప్రేమించుకున్నట్లు తెలుస్తుంది. వీరిలో మహిళా వాలంటీర్ రెండు రోజులుగా కనిపించడం లేదని, ఆమె భర్త పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యను అదే సచివాలయానికి చెందిన వాలంటీర్ తీసుకు వెళ్లినట్లుగా అతను ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈవిషయంపై ఇద్దరు వాలంటీర్లు విధులకు హాజరు కాకపోవడంతో వారిపై చర్యలు తీసుకుంటామని సచివాలయ అడ్మిన్ తెలిపారు.


రెండు రోజుల క్రితమే వృద్ధురాలిని హత్య చేసిన మరో వాలంటీర్


గత రెండు రోజుల క్రితమే విశాఖపట్నంలో ఓ వాలంటీర్ ఘాతుకానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఓ వృద్ధురాలిని గ్రామ వాలంటీర్ అంతం చేశాడు. పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్‌ లో ఈ ఘటన జరిగింది. పురుషోత్తపురం పరిధిలో 95వ వార్డు వాలంటీర్‌గా పని చేస్తున్న వెంకటేష్ అనే వ్యక్తి పెద్దావిడని హత్య చేసినట్లు చెబుతున్నారు. 


హత్యకు గురయిన వృద్ధురాలు వరలక్ష్మి వయసు 73. ఆమె నిర్వహిస్తున్న దుకాణంలో గత కొంత కాలంగా పార్ట్ టైం వర్కర్‌గా కూడా వాలంటీర్ వెంకటేష్ పని చేస్తున్నాడు. రాత్రి 10.30 గంటలకు వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను వెంకటేష్ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే పెందుర్తి పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్ ను పిలిపించి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆధారాలు సేకరించిన క్లూస్ టీం.. వృద్ధురాలిని చంపిన తీరుపై అంచనా వేశారు. ఆమె ముఖంపై దిండుతో అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా క్లూస్  టీం నిపుణులు ఆధారాలు సేకరించారు.


వృద్ధురాలిని హత్య చేయడమే కాకుండా ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను మొత్తం తీసుకొని నిందితుడు దోచుకొని వెళ్లిపోయాడు. పోస్టుమార్టమ్ కోసం ఆమె శవాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రాత్రి వృద్ధురాలు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ లోపలకు వచ్చి బయటికి వెళ్తున్నట్టు సీసీటీవీ కెమెరాలో వీడియో రికార్డు అయింది. సీసీటీవీ కెమెరాలో దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారు.