మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ నెల 15వ తేదీ నుంచి పరుగులు మొదలుపెట్టనుంది. ఇప్పటిదాకా దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ రైలు ఎనిమిదోది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఒక ఆదివారం తప్ప వారానికి 6 రోజుల పాటు ఈ రైలు సర్వీసులు ఉంటాయి. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వందేభారత్ ట్రైన్ ను వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించనున్నారు.






టైమింగ్ ఇవీ
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 20833. సికింద్రాబాద్ - విశాఖపట్నం రైలు నెంబరు 20834. విశాఖపట్నం నుంచి రైలు ఉదయం 5.45 గంటలకు బయలుదేరుతుంది. మధ్యలో రాజమండ్రి (7.55), విజయవాడ (10.00), ఖమ్మం (11.00), వరంగల్ (12.05), సికింద్రాబాద్ (14.15) గంటలకు చేరుకుంటుంది.


మళ్లీ సికింద్రాబాద్ నుంచి 15.00 (మధ్యాహ్నం 3 గంటలు) గంటలకు బయలుదేరి వరంగల్ (16.35), ఖమ్మం (17.45), విజయవాడ (19.00), రాజమండ్రి (20.58), విశాఖపట్నం 23.30 గంటలకు చేరుతుంది. తిరిగి మళ్లీ ఉదయం సర్వీసు యథావిధిగా కొనసాగుతుంది. ఒక్క ఆదివారం తప్ప మిగతా రోజుల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ఉంటాయి.


తెలుగు రాష్ట్రాల మధ్య నడవనున్న వందే భారత్ రైలు కోసం ముందే ఖరారు చేసిన షెడ్యుల్ లో మార్పు చేశారు. ఖమ్మం ప్రజల ఒత్తిడి నేపథ్యంలో కొత్తగా ఖమ్మం స్టేషన్‌లో వందేభారత్ రైలును ఆపాలని నిర్ణయించారు. ఈ రైలుకు 18 బోగీలు ఉండగా.. ప్రైమరీ మెయింటెనెన్స్ విశాఖపట్నంలోనే ఉండనుంది.




విశాఖ చేరుకున్న వందే భారత్ రైలును నిర్వహణ పర్యవేక్షణ కోసం న్యూ కోచింగ్‌ కాంప్లెక్స్‌కు తరలించారు. ఈ ట్రైన్ పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షలో ఉంటుంది. ఈ సీసీ కెమెరాలు లోకో పైలెట్‌ క్యాబిన్‌కు అనుసంధానించి ఉంటాయి. లోకో పైలెట్‌ కంట్రోల్లోనే కోచ్‌ల తలుపులు తెరుచుకునే, మూసివేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. మెట్రో రైల్లో మాదిరిగా ప్రయాణికుల అత్యవసర సహాయం కోసం టాక్‌ బ్యాక్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.


గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు ట్రయిల్ రన్ లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ ట్రైన్ బోగీలపై కంచరపeలెంలో రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో రెండు కోచ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో  ఆర్పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. రామ్మూర్తి పంతులుపేట గేటు దగ్గర ఆడుతున్న ఆకతాయిలు ట్రైన్ పై రాళ్లు విసిరినట్లు పోలీసులు గుర్తించారు. 


సెమీ హై స్పీడ్ ట్రైన్ 


వందేభార‌త్ రైలును పూర్తిగా ఇండియాలోనే త‌యారీ చేస్తున్నారు. దీన్ని సెమీ హై స్పీడ్ ట్రైన్‌గా పిలుస్తున్నారు. వందేభార‌త్‌కు ప్రత్యేక ఇంజిన్ ఉండ‌దు.  ఇందులో ఆటోమేటిక్ డోర్లు, ఏసీ చైర్ కార్ వంటివి ఉంటాయి. తక్కువ విద్యుత్తును వినియోగించుకునేలా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ రైళ్లను స్టీల్‌తో కాకుండా తక్కువ బరువు ఉండే అల్యూమినియంతో రూపొందిస్తున్నారు. వందే భారత్ ట్రైల్ రన్స్ సక్సెస్ అవుతుండటంతో..  త్వరలో వాటిని దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతారు. ఇవి ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనున్నాయి. దేశంలో 400 వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు గత కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో భాగంగా తయారైన ఐదు రైళ్లను పలు ప్రాంతాల్లో పట్టాలెక్కించారు.