Amit Shah Vizag Tour Postponed:

  కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా జూన్ 8న విశాఖకు రావాల్సి ఉంది. అయితే అమిత్ షా పర్యటన జూన్ 11వ తేదీకి వాయిదా పడిందని సోము వీర్రాజు తెలిపారు. దాంతో 11వ తేదీన విశాఖలో జరగనున్న అమిత్ షా బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ కావడంతో ఈ బీజేపీ నేతల ఏపీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.


జూన్ 10, 11న బీజేపీ అగ్రనేతల వరుస సభలు
ప్రధాని నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనపై నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ అగ్రనేతలు ఏపీలో పర్యటించనున్నారు. మొదట హోంమంత్రి అమిత్ షా, తరువాత బీజేపీ అధ్యక్షుడు నడ్డా చెరో బహిరంగసభలో ప్రసంగించేలా ప్లాన్ చేసింది బీజేపీ. అయితే ఈ నెల 8వ తేదీన విశాఖపట్నం రావాల్సిన అమిత్ షా పర్యటన 11కు వాయిదా పడింది. మోదీ ప్రభుత్వం సాధించిన తొమ్మిదేళ్ల విజయాలపై బహిరంగసభ ఏర్పాటు చేస్తోంది ఏపీ బీజేపీ. ఈ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. అంతకు ఒకరోజు ముందే, జూన్ 10వ  తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతికి రానున్నారు. తిరుపతిలో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించనున్నారు.  


ఏపీపై బీజేపీ అధిష్టానం ఫోకస్.. వచ్చే ఎన్నికలే టార్గెట్ ! 
ఆంధ్రప్రదేశ్  బీజేపీ పై దృష్టి పెట్టాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించుకున్నారని అందుకే ఇద్దరు అగ్రనేతలు మూడు రోజులలో ఏపీలో పర్యటించాలని భావిస్తున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ విషయంలో చాలా సమావేశాలు నిర్వహిస్తోంది కానీ.. ఇంకా ఏపీ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో వ్యూహాలు ఖరారు చేయడం లేదు. ఎన్నికలు ముంచుకు వస్తున్న సమయంలో బీజేపీతో పొత్తుల కోసం రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అంతా ఢిల్లీ స్థాయిలో ఏదో జరుగుతోందని చెబుతున్నారు కానీ రాష్ట్ర నేతలకు పెద్దగా సమాచారం ఉండటం లేదు. పొత్తుల విషయంలో హైకమాండ్ దే తుది నిర్ణయమని..  వారు ఏం చెబితే దాన్ని పాటిస్తామని రాష్ట్ర నేతలు అంటున్నారు. ఇప్పటికే తాము జనసేనతో మాత్రమే ఉన్నామంటున్నారు. 


ఏపీ బీజేపీ నేతలు పార్టీని బలోపేతం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. హైకమాండ్ నిర్దేశించిన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారు. గతంలో ఆరేడు వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించిన  బీజేపీ.. ఇటీవల ప్రజా చార్జిషీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వ విజయాలను కూడా ప్రచారం చేశారు. తాజాగా .. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి 9 ఏళ్లయిన సందర్భంగా నవ వసంతాలు - నవ కుసుమాల పేరిట తొమ్మిది విజయాలను భారీ స్థాయిలో ప్రచారం  చేయాలని నిర్ణయించుకున్నారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో గత నెల 30 వతేదీ నుంచి ఈ ప్రచారం ప్రారంభమయింది.