సోషల్ మీడియా వేదికగా చేసుకుని టీడీపీ, వైసీపీ నేతలు సెల్ఫీలతో సవాల్ విసురుకుంటు కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నారు. మాటకు మాటతో సవాళ్లు విసురుకుంటూ కొత్త తరహా వివాదానికి దారి తీస్తున్నారు. ఈ జాబితాలో సీదిరి అప్పలరాజు, గౌతు శిరీష చేరిపోయారు. 


రాష్ట్రపశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పలాస టీడీపీ ఇన్చార్జ్ గౌతు శిరీషల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. పలాసలో శిరీష తన శక్తికి మించి మంత్రి సీదిరితో పోరాతున్నారు. ఈసారి కొత్త ఒరవడి సృష్టిస్తూ ఇద్దరూ సెల్ఫీ ఛాలెంజ్‌లు విసురుకుంటున్నారు. ఇప్పటి వరకు మాటల వార్ సాగగా తాజాగా సెల్ఫీ వార్ వైపు అడుగులు వేసింది. 


పలాస కాశీబుగ్గలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి అవుతుంది. త్వరలో వైద్య సేవలందిస్తామని చెబుతూ ఆ భవనం ముందు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నిల్చొని, ముఖ్యమంత్రి మాస్క్ ధరించి కుర్చీపై కుర్చొని గురువారం సెల్ఫీ దిగారు. సోషల్ మీడియాలో దీన్ని పోస్టు చేయగానే పెద్ద ఎత్తున వైరల్ అయింది. 


శుక్రవారం పలాస నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జీ గౌతు శీరిష పలాస పట్టణానికి ఆనుకుని హుద్‌హుద్ ఇళ్లు చూపుతూ ఆమె సెల్ఫీ దిగారు. దీన్ని సోషల్ మీడియాలో పెట్టి సీదిరికి కౌంటర్ ఇచ్చారు. ఉద్దానం ప్రాంతంలో ఎవరి హయాంలో ఏమి అభివృద్ధి సాగిందో చర్చించుకుందామంటూ ఛాలెంజ్ విసిరారు. రంగులు వేసే భవనం ముందు సెల్ఫీ తీయడం కాదని, ఎన్నికలు వచ్చేలోగా ఆసుపత్రిని ప్రారంభించగలరా? అని శిరీష ఛాలెంజ్ విసిరారు. 


గతంలో పలాసలో ఎమ్మెల్యేగా ఉన్న గౌతు శివాజీ ఆధ్వర్యంలో నిర్మించిన 2090 టిడ్కో భవనాలు ముందు నిల్చుని ఛాలెంజ్ విసిరారు. పలాసలో సంవత్సరాలు దాటిన కేటీ రోడ్డు విస్తరణ పనులే పూర్తి చేయ లేదని గుర్తు చేశారు. నెమలి కొండపై, బెండికొండ వద్ద హుద్‌హుద్ ఇళ్లు ఎప్పుడు నిర్మించారో స్థానిక ప్రజలకు తెలుసని గుర్తు చేశారు. 


శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తమ ప్రభుత్వ హయాంలో సింగుపురం వద్ద ప్రారంభించిన నర్సింగ్ కళాశాల వద్ద ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నరసన్నపేటలో తమ ప్రభుత్వ హయాంలో రోడ్డు పనులు పూర్తి చేశామని సెల్ఫీలో అధికార పార్టీ నేతలు దిగారు. మరో చోట శిలాఫలాకాన్ని చూపుతు సెల్ఫీ తీసుకున్నారు. ఇలా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సెల్ఫీల యుద్ధం సాగుతోంది. 


జిల్లాలో శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డుపై ఇరుపక్ష నేతలు కలిసి తిరిగితే ప్రజలు ఎవరెవరిని ఏమంటున్నారో తెలుస్తుందని పలువురు సూచిస్తున్నారు. నాగావళి, వంశధార నది తీర ప్రాంతంలో కరకట్టల నిర్మాణాం చేపడతామని పాలకులు ఇచ్చిన హామీలు వరదలో కొట్టుకుపోయాయి. ఈ తీరప్రాంతాల్లోకి వెళ్లి సెల్ఫీ తీసుకుంటే అభివృద్ధి ఏమిటనేది కనిపిస్తుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లి మత్యకారులతో కదిలించి సెల్ఫీ తీసుకోవాలని, ఉద్దానం ప్రాంతానికి వెళ్లి కిడ్నీ బాధితుల బాధలో పాలుపంచుకుని సెల్ఫీ తీసుకోవాలని, సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్న నిర్వాసితుల వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటే వారి కష్టాలు తెలుస్తాయని ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు వెచ్చించిన నిధులు సకాలంలో ఖర్చు చేసి లక్ష్యాలను పూర్తి చేసుకోలేని రాజకీయ పార్టీ నేతలు సెల్ఫీలకు దిగితే వారి పరువే పోతుందని రాజకీయవిశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు తిరుగుబాటు చేసి సెల్ఫీలకు దిగితే ఎవరైన అడ్డుకోగలరా అని ప్రశ్నిస్తున్నారు.