President Ramnath Kovind reviews Naval Fleet In Visakhapatnam: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో భాగంగా విశాఖ సాగర తీరంలో 12వ ఎడిషన్ ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ (President Fleet Review 2022) సోమవారం ఘనంగా ప్రారంభమయ్యింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఐఎన్ఎస్ సుమిత్రను అధిరోహించి నౌకాదళ శక్తి సామర్థ్యాన్ని సమీక్షించారు. భారత నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలు పైకి ఎగురుతూ రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించాయి. 


60 యుద్ధనౌకలతోపాటు సబ్ మెరైన్స్, 55 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ప్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నేవీ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్లీట్ రివ్యూ సందర్భంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ లో రాష్ట్రపతి 21-గన్-సెల్యూట్ అందుకున్నారు. అంతకుముందు నేవల్ డాక్వర్డ్ కు చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సిబ్బంది గార్డ్ ఆఫ్ హానర్ అందించారు. స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తూ  ఆత్మనిర్భర్త వైపు పురోగతిని ప్రదర్శించే క్రమంలో ఈ ఫ్లీట్ రివ్యూ కీలకం కానుంది.  ఈ సమీక్షలో పాల్గొనే 60 నౌకలు , 47 జలాంతర్గాములు  భారతీయ షిప్‌యార్డ్‌లలో నిర్మించినవే.


సుప్రీం కమాండర్ హోదాలో ఫ్లీట్ రివ్యూ
44 యుద్ద నౌకలు 4 వరుసలుగా కొలువుదీరగా వాటి మధ్యనుంచి ఐఎన్ఎస్ సుమిత్ర (INS Sumitra) నౌక ముందుకు సాగింది. నావికాదళ శక్తియుక్తులను రాష్ట్రపతి స్వయంగా తిలకించి అభినందించారు. సమీక్ష అనంతరం రాష్ట్రపతి రామ్ నాథ కోవింద్ మాట్లాడుతూ.. భారత నావికాదళం మరింతగా స్వావలంబన సాధిస్తోందన్నారు. మేక్ ఇన్ ఇండియా చొరవలో నావికాదళం ముందంజలో ఉందని కితాబిచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ షిప్‌యార్డ్‌లలో 70 శాతం నిర్మాణాలు స్వదేశీపరిజ్ఞానంతో జరగడం గర్వకారణమని, భారతదేశం అణు జలాంతర్గాములను నిర్మించడం చాలా గర్వించదగిన విషయమని తెలిపారు. దేశీయంగా నిర్మించిన విమాన వాహక నౌక 'విక్రాంత్' త్వరలో సేవల్లో  చేరనుందన్నారు. 


గతేడాది డిసెంబరులో కొచ్చి పర్యటన సందర్భంగా 'విక్రాంత్‌'ని పరిశీలించడం ఆనందంగా ఉందని గుర్తుచేశారు. స్వదేశీ నౌకాదళ నౌకా నిర్మాణ సామర్థ్యాల అభివృద్ధి 'ఆత్మనిర్భర్ భారత్' తయారీకి అద్భుతమైన సహకారం ఉందన్నారు. భారత నౌకాదళం ద్వైపాక్షిక, బహుపాక్షిక విన్యాసాల్లో పాల్గొనడం గర్వించదగ్గ విషయమన్నారు. రాబోయే బహుళజాతి నౌకాదళ వ్యాయామం - మిలన్ 2022కి  శుభాకాంక్షలు తెలిపారు. ఆకస్మిక పరిస్థితులను సైతం సమర్ధంగా ఎదుర్కొనేందుకు భారత నావికాదళంతన సంసిద్ధతను ప్రదర్శించిందని తెలిపారు. 


విశాఖపట్నం శతాబ్దాలుగా ముఖ్యమైన ఓడరేవుగా ఉందని, ట్రాన్స్-నేషనల్ ట్రేడ్, కామర్స్ కు కీలకమైన కేంద్రం విశాఖని ఆయన తెలిపారు. తూర్పు నౌకాదళ కమాండ్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉండడం దీని వ్యూహాత్మక ప్రాముఖ్యతని, 1971 యుద్ధ సమయంలో విశాఖ అద్భుతమైన సహకారం అందించిందని గుర్తు చేశారు. 'స్వర్ణిమ్ విజయ్ వర్ష్' కింద సదరు యుద్ధంలో భారత్ విజయం సాధించిన గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఇటీవలే ముగిశాయని, కోవిడ్-19 మహమ్మారి సమయంలో, భారత నౌకాదళం 'మిషన్ సాగర్' , 'సముద్ర సేతు' ఆపరేషన్లు మరిచిపోలేమని రాష్ట్రపతి అన్నారు.  


భారత నావికాదళం తాజా స్వదేశీ కొనుగోళ్ల ప్రదర్శన
ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ (President Fleet Review)లో భారత నావికాదళం తాజా స్వదేశీ కొనుగోళ్ల ప్రదర్శన చేపట్టింది. ఫ్లీట్ స్టాటిక్ సమీక్షలో భాగంగా ఫ్లై పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రెసిడెన్షియల్ యాచ్ సమీక్ష వరుస ప్రయాణంలో ప్రతి ఓడ తన ఓడ కంపెనీతో "త్రీ జైస్"తో రాష్ట్రపతికి వందనం చేశాయి. ఫ్లీట్ రివ్యూ అనంతరం రాష్ట్రపతి ప్రత్యేక మొదటి రోజు కవర్, స్మారక స్టాంపును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ మాథ్ కోవింద్, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి. కె. జోషి, కేంద్ర సమాచారశాఖ సహాయ మంత్రి డి. జె చౌహాన్, రాష్ట్ర హోంమంత్రి ఎం.సుచరిత, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాసరావు, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రిత్వశాఖల కార్యదర్శులు, తదితరులు పి.ఎఫ్.ఆర్. కార్యక్రమాల్లో పాల్గొన్నారు..


ఐఎన్ఎస్ డేగాలో రాత్రి బస
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తూర్పు నౌకాదళ వైమానిక స్థావరమైన ఐఎన్ఎస్ డేగాలో సోమవారం రాత్రి బస చేశారు. ఆయన కోసం చోళ సూటు కేటాయించారు. అక్కడే ఏర్పాటుచేసిన 'రాష్ట్రపతి విందు'లో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం 10.20గంటలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరతారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు వేలాది మంది పోలీసులతో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. 


Also Read: Weather Updates: వేడెక్కుతున్న ఏపీ, గాలుల ప్రభావంతో తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత ! ఎల్లో అలర్ట్


Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! వరుసగా నేడూ బంగారం తగ్గుదల - వెండి మాత్రం స్థిరంగా