అవంతి శ్రీనివాస్ ఆడియో లీక్ కేసులో ఓ యూట్యూబర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 20న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. 


ఈ నెల 13న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆడియో అంటూ ఓ ఆడియో క్లిప్‌ వైరల్‌గా మారింది. ఆయన గొంతుతో ఉన్న ఈ ఆడియోలో మహిళతో అసభ్యంగా మాట్లాడినట్టు ఉంది. ఇదే ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


దీన్ని సోషల్ మీడియాలో ఓ మహిళ ఫొటోతో అప్‌లోడ్ చేశారని యూట్యూబర్‌ కోలా చంద్రశేఖర్ అనే వ్యక్తిపై ఫిర్యాదు రిజిస్టర్ అయింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు రియాక్ట్ అయ్యారు. విశాఖ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అవంతి ఫిర్యాదుతో ఐటీ యాక్ట్‌ 67, 72 సెక్షన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.


అవంతి శ్రీనివాస్ ఆడియో లీక్ కేసులో కోలా చంద్ర శేఖర్ అనే యూ ట్యూబర్‌కి విశాఖ పోలీసుల నోటీసులు ఇచ్చారు. అనీల్‌ దేశముఖ్‌ పేరిట ఉన్న యూ ట్యూబ్‌లో కోలా చంద్రశేఖర్‌ అనే యూట్యూబర్‌ అవంతి పేరిట ఉన్న ఆడియోను అప్‌లోడ్ చేసినట్టు గుర్తించారు. ఒక మహిళ ఇమేజ్‌తో పాటు తంబ్‌ నెయిల్‌ కూడా కనిపించాయి. 


అందుకే దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 20న ఉదయం 10గంటలకు సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో హాజరు కావాలని చంద్రశేఖర్‌కు నోటీసులు జారీ చేశారు. 


సుమారు ఏడాది క్రితం వైసీపీ నాయకుడు అవంతి శ్రీనివాసరావు ఫోన్ కాల్ సంభాషణ అంటూ ఓ ఆడియో వైరల్ అయింది. ఆయన దానిపై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయన వాయిసే అంటూ మరో ఆడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ మహిళతో మాట్లాడుతున్న వ్యక్తి ఆయనేనంటూ అంతటా చర్చ నడుస్తోంది.


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆడియో లీకుల రాజకీయం జోరుగా సాగుతోంది. ఒకటి అయ్యాక మరొకటి వెలుగుచూస్తోంది. ప్రజాప్రతినిధుల వాయిస్, వారి పేర్లతో వస్తున్న ఆ ఆడియోలు రాష్ట్ర రాజకీయాన్ని నిత్యం వాడివేడిగా ఉండేలా చేస్తున్నాయి. వీటి వల్ల అన్ని పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా మరో ఆడియో హల్ చల్ చేస్తోంది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరుతో ఈ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఆడియో 2 నిమిషాలకు పైగా ఉంది. తాజాగా సర్క్యూలేట్ అవుతున్న ఆడియో లవ్యూ బంగారం ఎప్పుడూ నిద్రేనా అంటూ స్టార్ట్ అవుతోంది. అయితే గతంలోనూ అవంతి శ్రీనివాస్ పేరుతో ఇలాంటి ఆడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు మాజీ మంత్రి స్పందిస్తూ తనకు ఆ ఆడియోకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. 


గతంలో ఆడియో లీక్ వ్యవహారంపై అవంతి శ్రీనివాస్ ఘాటుగానే స్పందించారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం అని అన్నారు. తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, మరి తనపై ఇలా ఎందుకు విష ప్రచారం చేస్తున్నారో తెలియటం లేదని చెప్పారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలతో తనను ఇబ్బంది పెట్టాలని కొంత మంది చూస్తున్నారని అన్నారు. తనకు దేవుడి మీద నమ్మకం ఉందని, ఆ దేవుడే అన్ని చూసుకుంటాడని పేర్కొన్నారు. పార్టీలో కూడా తన ప్రతిష్ఠ దెబ్బ తీయాలని ఎవరో ప్రయత్నం చేసినట్టు అర్థం అవుతుందని అన్నారు. ఆ ఆడియో లీక్ పై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అప్పుడు అవంతి కోరారు. ఆడియోలో నిజానిజాలు అన్నీ పోలీస్ వారే చెప్తారని అప్పుడు అన్నారు. తనపై కుట్రలో భాగంగానే ఆడియో లీక్ వ్యవహారాలు తనకు అంటగడుతున్నారని ఆరోపించారు. తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తిని అని పేర్కొన్నారు. తాను రాజకీయ ప్రత్యర్థులపై కూడా ఎప్పుడూ ఆరోపణలు చేయలేదని, తన రాజకీయ ఎదుగుదల చూసి తట్టుకోలేక పోతున్నారని అన్నారు.