Visakhapatnam Toll Plaza Issue: విశాఖ ప్రజల సమస్యపై పార్లమెంట్ లో గొంతు ఎత్తారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. నగర పరిధిలోని అనేక ప్రాంతాల ప్రజలకు సమస్యగా టోల్ ప్లాజా సమస్యను పార్లమెంటు దృష్టికి ఆయన తీసుకువచ్చారు. స్థానికులకు అధిక భారమైన అగనంపూడి టోల్ ప్లాజా ఉందని, టోల్ ప్లాజా ను తొలగించాలని ఆయన పార్లమెంటు వేదికగా డిమాండ్ చేశారు.  విశాఖపట్నం సిటీ  పాత జాతీయ రహదారిపై ఉన్న అగనంపుడి ప్లాజా వలన స్థానిక ప్రజలపై అధిక భారం పడుతోందన్నారు. సబ్బవరం, అనకాపల్లి మధ్య కొత్త జాతీయ రహదారిని ఇప్పటికే నిర్మించినప్పటికీ అగనంపూడి టోల్ ప్లాజా తీసివేయనందు వల్ల విశాఖ ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు. కనీసం స్థానిక ప్రజలకు కూడా ఎలాంటి మినహాయింపు లేదని, ఫలితంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. వీలైనంత త్వరగా చర్యలు చేపట్టి అగనంపూడి టోల్ ప్లాజా ను  తొలగించాలని కోరారు. 


తొలగిస్తామని సమాధానం చెప్పిన కేంద్రమంత్రి గడ్కరి సమాధానం


ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంట్లో ప్రస్తావించిన ఈ సమస్యపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెంటనే స్పందించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి నిబంధనలను అనుసరించి కాంట్రాక్టర్ కు టోల్ ప్లాజా మంజూరు చేయబడిందని, నిబంధనలను అనుసరించి అతనికి ఉన్న కాలపరిమితి ముగియడానికి ముందే దీన్నీ తొలగించినట్లయితే భారీ స్థాయిలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. కానీ, జీవీఎల్ లేవనెత్తిన అంశం సహేతుకమైనందు వల్ల స్థానిక ప్రజలు ఈ భారాన్ని భరించడం సరి కాదన్నారు. వీలైనంత తొందరగా ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపి స్థానిక ప్రజలపై పడే భారాన్ని తొలగిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. తమ సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావించడంపై స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.