ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు గురించి మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మార్చి 3, 4 తేదీల్లో జరిగే ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతం కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఉండాలని అన్నారు. సదస్సు నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఆల్ ది బెస్ట్ అని తెలిపారు. ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించడం, ఉద్యోగాల కల్పన నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు దాదాపు 12 ఇప్పటిదాకా వేల రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా తెలుస్తోంది.
ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నందున ఆ నగరాన్ని దాదాపు రూ.100 కోట్లతో అందంగా తీర్చిదిద్దారు. అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుండంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఆరుగురు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, రెండు రోజులపాటు విశాఖపట్నంలోనే ఉండనున్నారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ఆర్కే సింగ్, జి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. ముగింపు కార్యక్రమంలో కేంద్రమంత్రులు శర్బానంద సోనావాల్, సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొంటారు.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆదానీ గ్రూప్ అధినేత గౌతమ్ ఆదానీ, ఆదిత్యా బిర్లా గ్రూపు ఛైర్మన్ కుమార మంగళం బిర్లా సహా పేరొందిన భారతీయ కంపెనీల అధిపతులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ముగింపు సందర్భంగా భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ సుచిత్రా ఎల్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఛైర్మన్ సతీష్ రెడ్డి, వెల్ప్సన్ గ్రూప్ ఎండీ రాజేశ్ మండవేవాలా, షట్లర్ పీవీ సింధూ తదితరులు పాల్గొంటారు.