• ప్రజల కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొంటా 
• జైలుకి వెళ్లడానికి కూడా సిద్ధం
• దెబ్బలు తినకుండా, కేసులు పడకుండా రాజకీయాలు సాధ్యం కాదు
• ప్రజల కోసం పోరాటం చేస్తుంటే నోటీసులు ఇస్తున్నారు
• నేరచరితులను ఎన్నుకుంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయి
• వీరికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండదు
• దౌర్జన్యాలు, దోపిడీల మీద మాత్రమే నమ్మకం ఉంటుంది
• ఎవరూ మాట్లాడకుంటే అంచెలంచెలుగా దోచుకోవచ్చు
• రుషికొండ దోపిడి బయటపెడతామనే డ్రోన్ల మీద నిషేధం
• ప్రశ్నించే గొంతు నొక్కడమే ఎమర్జెన్సీ
• ఇలాంటి వాటికి జనసేన పార్టీ భయపడదు
• జనసేన పార్టీ నేరమయ రాజకీయాలకి వ్యతిరేకంగా పోరాడుతుంది
• పోలీసుల నుంచి నోటీసులు తీసుకున్న సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
'ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేతత్వం లేకపోతే దోపిడీలు ఎక్కువైపోతాయి. నేను ఒక తరానికి బాధ్యత గుర్తు చేయడానికి వచ్చాను. ఆ బాధ్యతను మేము తీసుకుంటాం. యుద్ధం మొదలయ్యింది. యుద్ధాన్ని మీరు ప్రారంభించారు. దాన్ని స్వీకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామ'ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు.  దెబ్బలు తినకుండా, జైళ్లకు వెళ్లకుండా, కేసులు పడకుండా రాజకీయాలు సాధ్యం కాదని, ప్రజల కోసం ఎన్ని కేసులనైనా స్వీకరిస్తానన్నారు. అందుకోసం జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధం.. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాను అని తెలిపారు. 





మర్డర్లు చేసేవారిని వెనకేసుకొస్తే ఇలా రాజ్యమేలుతారు..
ప్రజల కోసం పోరాడితే నోటీసులు ఇస్తున్నారని అన్నారు. బూతులు తిట్టేవారు, భూదందాలు చేసే వారు.. మర్డర్లు మానభంగాలు చేసే వారిని వెనకేసుకొస్తే ఇలాంటి వారే రాజ్యాలు ఏలుతారని అన్నారు. నేరమయ  రాజకీయాలకి వైసీపీ ఉదాహరణ అని.. ఈ తరహా రాజకీయాలకి వ్యతిరేకంగా జనసేన పోరాటం చేస్తుందని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఆదివారం మధ్యాహ్నం విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నెల రోజుల పాటు విశాఖ పరిధిలో సభలు, సమావేశాలు నిర్వహించడానికి అనుమతిలేదని నోటీసులో పేర్కొన్నారు. 





ప్రజలకి కోపం రాదు. నాయకులకీ అడిగే ధైర్యం లేదు !
నోటీసులు తీసుకునే ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ "రాష్ట్రంలో గొంతులేని వారి మీద లా అండ్ ఆర్డర్ చాలా బలంగా పని చేస్తుంది. ఎదురుదాడి చేసే వారి మీద బలహీనంగా పని చేస్తుంది. ఇలాంటి వారు ప్రభుత్వం నడుపుతున్నారు. నాలాంటి వారి మీద కేసులు పెడితే ఎక్కడయినా చిన్న గ్రామంలో ఏదైనా జరిగితే రేపటి రోజున అడిగే వారు ఉండరు. ఎమర్జెన్సీ అనేది ప్రత్యేకంగా ప్రకటించాల్సిన అవసరం లేదు. గొంతు ఎత్తకుండా చేయడాన్ని మించి ఎమర్జెన్సీ ఏముంటుంది. గొంతు ఎత్తకూడదు అంటే ఇంకా ప్రజాస్వామ్యం ఏముంది. నేర చరిత్ర ఉన్న వారిని ఎన్నుకుంటే వచ్చే సమస్య ఇది. ప్రజాస్వామ్యం మీద వారికి నమ్మకం ఉండదు. కేవలం దౌర్జన్యం మీద నమ్మకం ఉంటుంది.


చట్టాలు వారి చేతుల్లో ఉంటాయి. ఎవరూ ఏమీ మాట్లాడకూడదు. అలా మాట్లాడకుండా ఉంటే అంచెలంచెలుగా దోచుకోవచ్చు. ఎవరు ఎంత సంపాదించినా అడిగే వారు లేరు. మద్యపానాన్ని అంచెలంచెలుగా నిషేధిస్తామన్నారు. ఇప్పుడు భారీగా అమ్మకాలు జరుపుతుంటే అడిగేవారు లేరు. అయినా ప్రజలకి కోపం రాదు. నాయకులకీ అడిగే ధైర్యం లేదు. ఇదే ప్రజాస్వామ్యం. మూర్ఖంగా బూతులు తిట్టేసి మీదపడిపోవడాన్ని వాళ్లు పరిపాలన అనుకుంటున్నారు. 


విశాఖలో స్టీల్ ప్లాంట్ వస్తే జగిత్యాల వారికి ఉద్యోగాలు వస్తాయా?
నెల్లూరులో ఉండగా నాకు గఢాఫీ గురించి చాలా గొప్పగా చెప్పే వారు. ప్రజల్ని బాగా చూసుకుంటాడు అని. అలాంటి వ్యక్తిని నడిరోడ్డు మీద కొట్టి ఎందుకు చంపేశారు? దశాబ్దాల తరబడి ప్రజలను హింసిస్తే తిరగబడతారు. రేపటి రోజున మీరు కూడా అంతే.స్కీములు, రాయతీలు అంటూ బెనిఫిట్స్ ఇస్తున్నామంటారు. అభివృద్ధి చేయరు. దాని గురించి ఎవరూ అడగకూడదు. మాట్లాడితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉన్నారు కదా వారికి చెప్పవచ్చు కదా అంటారు. గొడవ జరిగిన ప్రతి సారీ వెళ్తామా? నేను ఒక పార్టీ అధ్యక్షుడిని. మాకు లక్షల ఓట్లు ఉన్నాయి. మేము మాట్లాడితే కోట్లాది మందికి చేరుతుంది. మేమే పోరాటం చేస్తాం. ఇది మా యుద్ధం. తెలుగు నేల కోసం చేస్తున్న యుద్దం ఇది. ఇష్టారాజ్యంగా చేసే వ్యక్తులు రాజ్యాలు ఏలుతుంటే మాట్లాడేవారు ఎవరూ లేరు. ఉభయ సభల్లో 30 మంది ఎంపీలు ఉన్నారు. వారు ప్రత్యేక హోదా గురించి అడగరు. అప్పుడు కోపాలు రావు. ప్రజలకు కోపం లేకపోతే నేనేం చేస్తాను. స్టీల్ ఫ్యాక్టరీ కోసం 32 మంది అధికారికంగా చనిపోయారు. అనధికారికంగా 180 మంది చనిపోయారు. అందులో అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. జగిత్యాలకు చెందిన వారు చనిపోయారు. వాళ్లంతా రకరకాల జిల్లాల వారు. అప్పుడు లేని ప్రాంతీయ విభేదాలు ఇప్పుడు ఎందుకు తెస్తారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ వస్తే జగిత్యాలలో ఉద్యోగాలు వస్తాయా? ఆనాటి తరం అంతా మనది అనుకుని చేశారు.
మీరు చెప్పిన వీకేంద్రీకరణ ఇదేనా?
ఇప్పుడు ఏం చేసినా గొంతెత్తకూడదు. నోరెత్తకూడదు. నిరసన తెలపకూడదు. ప్రతిసారి భయపెట్టే పరిస్థితులు వచ్చేశాయి. ఒకప్పుడు జర్నలిజంలో ఉన్నవారు ఉమ్మడిగా సమస్య మీద పోరాడే వారు. ఇప్పుడు మనం కూడా ప్రాంతీయత, కులంగా విడిపోతే ప్రజలకు ఏం మంచి జరుగుతుంది. ఒక పరిమిత ఆలోచనా విధానంతో కూడిన ఏ సిద్ధాంతం నిలబడింది లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంతో ప్రారంభమైన టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని ఎందుకు పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు సిద్ధాంతాల విస్తృతి పెరుగుతూ ఉంటుంది. నేను ఒక కులంతో, ప్రాంతంతో ముడిపడి పార్టీ పెట్టలేదు. ఓ మంత్రి గారు మా కులం అ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఆ హక్కు ఎవరిచ్చారు. మీరు మెప్పు పొందడం కోసం మమ్మల్ని తిడతారా? అమరావతి భూములు అన్ని ఒకే సామాజికవర్గానివి అన్నారు. ఇప్పుడున్న నాయకుడి సామాజికవర్గానికి 70 శాతం భూములు ఉంటే ఆ రాజధాని ఆ వర్గానిదే అవుతుంది కదా? చుక్కల భూములు కూడా తీసేసుకున్నారు. అణగారిన వర్గాలు ఈ రోజుకీ గుర్తింపుకోసం కొట్టుకుంటూ ఉన్నారు. వికేంద్రీకరణ అంటే ఇదేనా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
ప్రజల్లో మార్పు తెస్తామనే జనసేనంటే భయం
జనసేన పార్టీ అంటే ఎందుకు భయపడతారో తెలియదు. రెండు చోట్లా ఓడిన మా గురించి భయపడాల్సిన పనేంటి? వీరికి మేమంటే ఏదో భయం ఉంది. ప్రజలను ఆలోచింప చేస్తారనో.. ప్రజలు మారుతారనో భయం ఉంది. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకుంటే.. మాస్కులు లేవన్నందుకు డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడిని చేసి చనిపోయేలా చేశారు. పోలీసుల సమక్షంలో కూర్చోబెట్టి గుండు గీయించేశారు. కేవలం ఇది ఒక కులం, వర్గం అని చెప్పాలా? ప్రతి కులానికీ నన్ను తిట్టే చాలా మంది. కాపు కులానికి చెందిన వైసీపీ మంత్రి మా సోదరుడు అంటూ తిట్టడానికి మీరేమైనా నాకు బొడ్డు కోసి పేరు పెట్టారా? వాళ్ల మెచ్చుకోళ్ల కోసం మమ్మల్ని తిట్టే హక్కు ఎవరిచ్చారు" అన్నారు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు పాల్గొన్నారు.