విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం... విశాఖ అభివృద్ధికి వేగంగా అడుగులు వేస్తోంది. దసరా నుంచి విశాఖ నుంచే పాలన  మొదలవుతుందని... సీఎం క్యాంప్‌ కార్యాలయం కూడా విశాఖకు షిఫ్ట్ అవుతుందని వైసీపీ సర్కార్‌ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు.. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి  చేసేందుకు కృషిచేస్తోంది. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలపై ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా భారీ ప్రాజెక్టులకు తీసుకొస్తోంది ఏపీ సర్కార్‌. 


ఇప్పటికే... ఐటీతోపాటు ఐటీ ఆథారిత పరిశ్రమల ఆకర్షణలో విశాఖ నగరం ముందంజలో ఉందని నీతి ఆయోగ్‌ కూడా ప్రకటించింది. ఈ క్రమంలో ఏపీ ఇండ్రస్టియల్‌  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ) మరో భారీ ప్రాజెక్ట్‌ చేపడుతోంది. భారీ ఐటీ బిజినెస్‌ పార్క్‌ను విశాఖలో ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. అక్కడ ఇప్పటికే అదానీ డేటా  సెంటర్‌తో పాటు ఐటీ పార్క్, రహేజా గ్రూపు ఇన్‌ఆర్బిట్‌ మాల్‌తో పాటు ఐటీ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు... మధురవాడ హిల్‌ నెంబర్‌–3లో  భారీ ఐటీ బిజినెస్‌ పార్క్‌  ఏర్పాటు చేయబోతున్నారు. 18.93 ఎకరాల విస్తీర్ణంలో ఐ–స్పేస్‌ పేరుతో ఈ ఐటీ బిజినెస్‌ పార్కుకు శ్రీకారం చుడుతోంది ఏపీ సర్కార్‌. ఈ ఐటీ బిజినెస్‌ పార్కును పీపీపీ  విధానంలో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను కూడా ఆహ్వనించింది ఏపీఐఐసీ. భాగస్వామ్య కంపెనీ ఎంపిక అయిన తర్వాత... నిర్మాణ పనులను  ప్రారంభించాల్సి ఉంటుంది. 


మల్టీనేషనల్‌ కార్పొరేషన్‌ సంస్థలను ఆకర్షించేలా ఈ ఐటీ బిజినెస్‌ పార్కుకు ఏర్పాటు చేయబోతున్నారు. 2వేల 300 కోట్ల రూపాయల పెట్టుబడులతో అభివృద్ధి  చేయబోతున్నాయి. అయితే... పబ్లిక్, ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో ఈ పార్కును నెల‌కొల్ప‌నుండ‌గా.. ఇందులో ఏపీఐఐసీ 26 శాతం వాటా. భాగస్వామ్య కంపెనీది  74 శాతం వాటా ఉంటుంది. అంటే ఈ ప్రాజెక్టు వ్యయంలో ఏపీఐఐసీ 239 కోట్ల రూపాయలను ఈక్విటీ రూపంలో అందిచనుంది. ఇక భాగస్వామ్య కంపెనీలు 681 కోట్ల  రూపాయలు సమకూరుస్తాయి. మిగిలిన 1,380 కోట్ల రూపాయలను అప్పుగా సేకరిస్తారు. ఐటీ బిజినెస్‌ పార్కులో కమర్షియల్‌ కాంప్లెక్స్‌లతో పాటు మీటింగ్‌ హాల్స్‌, బిజినెస్‌  హోటల్స్, సర్వీస్‌ అపార్ట్‌మెంట్స్, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ ఫెసిలిటీలతో పాటు అన్ని సౌకర్యాలు ఉండేలా అభివృద్ధి చేయనున్నారు.