విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం (Chandrababu Health)పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలపై ఏపీ మంత్రి బొత్స  సత్యనారాయణ (Botsa Satyanarayana) మండిపడ్డారు. అనుకూల మీడియాలో చంద్రబాబుకు అనుకూల కథనాలు ఇవ్వడం సరికాదని హితవు పలికారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. విజయనగరంలో మంత్రి బొత్స శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఒకవేళ చంద్రబాబు అనారోగ్యంగా ఉన్నారని కుటుంబసభ్యులు భావిస్తే కోర్టును ఆశ్రయించాలని సూచించారు. జిమ్మిక్కులతో చంద్రబాబు ఇన్నాళ్లు కేసుల నుంచి తప్పించుకుంటూ నెట్టుకొచ్చారని చెప్పారు.


ఆధారాలతో చంద్రబాబు అరెస్ట్..
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఆధారాలతో అడ్డంగా దొరికిపోయారు. ఆధారాలు సేకరించాకే చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఇప్పుడు అరెస్టైయి జైల్లో ఉండటంతో అనారోగ్యమంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు చంద్రబాబుకు అనారోగ్యమని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తనకు చంద్రబాబు అభిమాని ఫోన్ చేసి ఏడవడం, ఓ ఛానల్ టెలికాస్ట్ చేయడం చూస్తే ఇది జిమ్మిక్ అని తెలుస్తోందన్నారు.  అది ఓ ఛానల్‌ టెలీకాస్ట్ చేయడం జిమ్మిక్ కాదా. సానుభూతి కోసం టీడీపీ నేతలు ఏపీ ప్రభుత్వంపై, జైలు అధికారులపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స పేర్కొన్నారు.