Havelock Bridge: గోదావరిపై బ్రిటీషర్స్ కట్టిన తొలి బ్రిడ్జి 125 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1897లో నిర్మాణం మొదలు పెట్టిన ఈ బ్రిడ్జి ఇప్పటికీ అంతే దృఢంగా ఉంది. 1897 నుంచి 1997 వరకు 100 ఏళ్ల పాటు రైళ్ల రాకపోకలకు సహకరించిన ఈ బ్రిడ్జి.. ప్రస్తుతం గత చరిత్రకు సాక్షిగా నిలిచింది. అప్పటి మద్రాస్ గవర్నర్ సర్ ఆర్ధర్ ఎలిబ్యాంక్ హేవలాక్ పేరు మీద ఈ బ్రిడ్జ్ కి హేవలాక్ బ్రిడ్జి అనిపేరు వచ్చింది. చాలా మంది ఆయనే ఈ బ్రిడ్జి కట్టిన ఇంజినీరు అనుకుంటారు. కానీ అది పొరపాటు. ఫ్రెడరిక్ థామస్ వాల్టన్ అనే బ్రిటీష్ ఇంజినీర్ ఈ బ్రిడ్జ్ ని నిర్మించారు. 


అంతకు ముందు కేవలం పడవలే..


ఈ బ్రిడ్జి నిర్మాణంలో ప్రధానంగా రాయి, స్టీలుని వాడారు. బ్రిడ్జి పొడవునా మొత్తం 56 స్తంభాలు ఉంటాయి. అప్పట్లో బ్రిటీష్ వారి ప్రధాన స్థావరాలైన మద్రాస్ - కలకత్తా మధ్య రవాణా అనేది ఈ బ్రిడ్జి నిర్మించడం ద్వారా సులువుగా మారింది. అలాగే గోదావరిని సురక్షితంగా దాటడానికి ప్రజలకు కూడా ఒక రవాణా సాధనం లభించినట్లు అయింది. అంతకు ముందు కేవలం పడవల ద్వారానే గోదావరిని దాటేవారు. అలాంటి సమయాల్లో గోదావరి ఉద్ధృతంగా ఉన్నప్ప్పుడు ఒక్కోసారి ప్రాణనష్టం కూడా జరిగేది. అలాంటి వాటికి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చెక్ పెట్టింది. అప్పట్లో బ్రిడ్జి పైన ఎలాంటి ఆధారం లేకుండా .. ట్రైన్ వెళుతుంటే అందులోని ప్రయాణికులు చాలా భయపడేవారు. అదే సమయంలో థ్రిల్ గా కూడా ఫీలయ్యేవారు. దాని పక్కనే ఆర్క్ బ్రిడ్జి కట్టాకా... ఈ హేవలాక్ వంతెనను విధుల నుంచి తప్పించారు . 


టూరిజం ఎట్రాక్షన్ గా..


హేవలాక్ బ్రిడ్జిని పూర్తిగా తొలగించి దానిలోని స్టీల్ ని తీసుకెళ్లాలని రైల్వే శాఖ భావించింది. అయితే దానికి రాజమండ్రి ప్రజలు అడ్డు పడ్డారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జిని తొలగించవద్దని.. టూరిజంపరంగా డెవలప్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ బ్రిడ్జి పైన రోడ్డు వేసినట్లయితే.. అది సైకిల్ పై రాజమండ్రి వచ్చే చిరు వ్యాపారులకు, రైతులకు లాభిస్తుందని వివరించారు. అలాగే వాకింగ్ చేసేవారికి కూడా అందుబాటులోకి వస్తుందని, అంతే కాకుండా బ్రిడ్జి పైన చిన్నచిన్న దుకాణాలను ఏర్పాటు చేసి మార్కెట్ ను ఏర్పాటు చెయ్యాలని చెప్పారు. దీని వల్ల రాజమండ్రికి పెద్ద టూరిజం ఎట్రాక్షన్ హేవ్ లాక్ బ్రిడ్జి మారుతుందని ప్రజలు పేర్కొంటున్నారు.


గతంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా అటు రైల్వే శాఖకు, ఇటు ప్రభుత్వానికి చేరాయి. అయితే నిధుల విడుదలలో ఆలస్యం కారణంగా ఈ ప్రపోజల్ లో స్తబ్దత నెలకొంది. ఈ అడ్డంకులన్నీ తొలగి త్వరలోనే హేవలాక్ బ్రిడ్జి ని పాదచారులకు అందుబాటులోకి తెస్తారని గోదావరి జిల్లాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి చిరకాల కోరిక తీర్చాలని వేడుకుంటున్నారు.