Srikakulam News: దువ్వాడ శ్రీను కుటుంబ వ్యవహారం మరోసారి టాక్‌ఆఫ్‌ ది స్టేట్‌గా మారింది. శుక్రవారం రాత్రి కూడా దువ్వాడ శ్రీను ఇంటి వద్ద గలాటా జరిగింది. ఆయన్ని కలుసుకునేందుకు ఫ్యామిలీ వస్తే ఉద్రిక్తత నెలకొంది. గురువారం సాయంత్రం దువ్వాడను కలిసేందుకు ఇద్దరు కుమార్తెలు మాత్రమే వచ్చారు. శుక్రవారం సాయంత్రం మాత్రం కుమార్తెలతో కలిసి తల్లి వాణి కూడా వచ్చారు. 


దువ్వాడ శ్రీనును కలిసేందుకు సాయంత్రం దువ్వాడ వాణి, కుమార్తెలతో కలిసి వచ్చారు. ఆయన ఎప్పటికీ బయటకు రాకపోవడంతో తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. ఇది కాసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. అక్కడ గందరగోళం నెలకొనడంతో ఎట్టకేలకు దువ్వాడ శ్రీనివాస్ బయటకు వచ్చి ఫ్యామిలీపై చిందులు తొక్కారు. 


సాయంత్రం వచ్చిన దువ్వాడ ఫ్యామిలి అర్థరాత్రి వరకు అక్కడే ఉండిపోయింది. ఎలాగైనా సరి దువ్వాడ శ్రీనివాస్‌ను కలిసే వెళ్తామని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు. చివరకు బయటకు వచ్చిన దువ్వాడ శ్రీను వారిపై కేకలు వేస్తూ విమర్సలు చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. వారిపైకి దువ్వాడ దురుసుగా వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. 


దువ్వాడ శ్రీను ఫ్యామిలీలో విభేదాలకు ఆయన సోదరుడు శ్రీధర్‌ కారణమని వాణి ఆరోపిస్తోంది. దువ్వాడ శ్రీధర్ చాలా కుటుంబాల్లో చిచ్చుపెట్టాడని ఇప్పుడు సొంత అన్న ఫ్యామిలీలోనే గొడవలకు కారణమయ్యారని అన్నారు. పరువుగా బతుకుతున్నామని తమను రోడ్డుపైకి లాగారని వాపోయారు. ఇలా పరువు బజారుకు ఈడ్చిన వారందరిపై న్యాయపోరాటం చేస్తామన్నారు.