విశాఖలో వివిధ కార్యక్రమాల శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీకి జగన్ పలు విజ్ఞప్తులు చేశారు. విభజన గాయాల నుంచి కోలుకునేందుకు కేంద్రం సాయం చాలా అవసరమని కామెంట్ చేసిన జగన్... ఆ టైంలో ఇచ్చిన హామీలు ప్రస్తావించారు. వాటిపై సానుకూలం నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు. 


మూడేళ్లల్లో సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ రాష్ట్రాన్ని పాలిస్తున్నామని కామెంట్ చేసిన సీఎం జగన్... ఇందులో కేంద్రం సాయం చాలా ఉందని గుర్తు చేశారు. ప్రతి కుటుంబం హ్యాపీగా బతికేలా రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టు వివరించారు. ప్రజలంతా ఆత్మవిశ్వాసంతో బతికేందుకు ప్రతి రూపాయి ఖర్చు పెడుతున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వం శక్తి మేరకు చేస్తున్న ప్రయత్నానికి కేంద్ర సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు.  


ఎనిమదేళ్ల క్రితం తగిలిన గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని గుర్తు చేశారు. ఆ గాయాల మానేలా ఆంధ్రప్రదేశ్‌ 
జాతీయ స్రవంతితో అభివృద్ధి చెందేలా చేసే సాయం చేయాలని రిక్వస్ట్ చేశారు జగన్. అలా ఇచ్చే ప్రతి రూపాయి, ప్రతి సంస్థ రాష్ట్ర పునర్‌నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం కోసం కేందద్రం చేసే ఏ మంచైనా కూడా ఈ ప్రజానీకం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందన్నారు. 



కేంద్రంతో ప్రత్యేకంగా మోదీతో తమకు ఉన్న అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతమని అన్నారు సీఎం జగన్. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప వేరే ప్రయోజనాలు ఉండబోవని స్పష్టం చేశారు. ప్రజలకు, రాష్ట్రానికి గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలను సరి చేస్తూ కేంద్రం చేసే మంచి పనిని గుర్తు పెట్టుకుంటామన్నారు. విభజన హామీల వద్ద నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వేజోన్ వరకు అన్నింటిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.