Botsa Satyanarayana fires on govt over demolishing of ex army staff | విజయనగరం: నెల్లిమర్ల మండలం దన్నానపేటలో 60మంది పోలీసులతో వెళ్లి రెవిన్యూ సిబ్బంది మాజీ సైనికుడి ఇళ్లు కూల్చివేయడం వివాదాస్పదమైంది. ఏపీలో కొత్త సంస్కృతికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మాజీ సైనికుడి ఇల్లు కూల్చివేతపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. తాను 1985 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నానన్న మాజీ మంత్రి బొత్స.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా,  రాజకీయాలు వీడలేదని.. అయితే ఇన్నేళ్లలో ఏనాడూ ఇలాంటి దురదృష్టకర ఘటన చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతికి జిల్లాలో శ్రీకారం చుట్టారని ఆయన మండిపడ్డారు. అసలు దీని వల్ల ఏం లాభిస్తుందని, ఇది సమంజసమేనా అని టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు.

 

ఇల్లు కూల్చివేత దారుణం

దేశం కోసం పోరాడిన ఓ మాజీ సైనికుడి ఇల్లు కూలిస్తే, అధికార పక్షం వారికి ఏం లాభిస్తుందని, అది కూడా ఎక్కడో మారుమూల ధన్నానపేట అనే గ్రామంలో ఇలాంటి చర్యకు పాల్పడడం అత్యంత హేయమని మాజీ మంత్రి బొత్స ఆక్షేపించారు. ఒక వేళ ఆ ఇంటి స్థలం, ప్రభుత్వానికి చెందింది అయితే, అక్కడ ఇల్లు కట్టుకున్న వారు అర్హులైతే పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

 

నిజానికి గత ఎన్నికల ఫలితాల నాటి నుంచే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయని గుర్తు చేసిన మాజీ మంత్రి బొత్స, తమ జిల్లాలో ఈ రకమైన సంప్రదాయం రాకూడని బలంగా కోరుకున్నామని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు, ఈ తరహా ఫిర్యాదులు వచ్చినా, ఇంత దారుణంగా వ్యవహరించి, ఆస్తులు కూల్చివేయలేదని తెలిపారు.





 

కలెక్టర్‌ పాత్ర ఆక్షేపణీయం

ఈ ఘటనలో జిల్లా కలెక్టర్‌ పాత్ర ఆక్షేపణీయమన్న మాజీ మంత్రి బొత్స, అసలు ఏ విధంగా ఒక మాజీ జవాన్‌ ఇల్లు కూల్చివేతకు ఆనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఫిర్యాదుపై స్వయంగా వెళ్లి పరిశీలించకుండా, ఏకంగా దాదాపు 50 మంది పోలీసులతో వెళ్లి ఇల్లు కూల్చడం ఏమిటని నిలదీశారు. ఇలాంటి వాటిలో మానవీయ కోణం అవసరమని అన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వాస్తవాలు గుర్తించి, ఇకనైనా ఈ తరహా చర్యలు వీడాలని, వైఖరి మార్చుకోవాలని అధికార పార్టీ నేతలకు సూచించారు.

మాజీ జవాన్ ఇల్లు కూల్చివేసిన సిబ్బంది
ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేశారన్న కారణంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేటలో ఆర్మీ మాజీ జవాన్ పతివాడ వెంకునాయుడు ఇంటిని రెవిన్యూ సిబ్బంది కూల్చివేశారని వైసీపీ ఆరోపించింది. టిడిపి కార్యకర్తలు పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ లో ఆర్మీ జవాన్ పై ఫిర్యాదు చేయగా.. అధికారులు సిబ్బందితో వచ్చి దారుణం చేశారని విమర్శించారు. 


దన్నాన పేట లో రామతీర్దాలు దేవాలయ సంబందిత భూ అక్రమణలు జరిగి, కొందరు ఇక్కడ ఇళ్లు కట్టుకొని ఉంటున్నారు. అనంతరం ఈ భూముల క్రయవిక్రయాలు సైతం జరిగాయి. తాజాగా టిడిపి కార్యకర్తలు పార్టీ గ్రీవెన్స్ లో పతివాడ వెంకునాయుడుపై ఫిర్యాదు చేశారు. దీంతో రెవన్యూ సిబ్బంది ఆగమేఘాల మీద వచ్చి మాజీ జవాన్ ఇళ్లు నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఒక్కడి ఇల్లు ఎందుకు కూల్చుతున్నారు, చాలా మంది ఇండ్లు అలాగే కట్టారని చెప్పినా రెవెన్యూ సిబ్బంది పట్టించుకోలేదని బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు.