Visakha Drunk And Drive : విశాఖలో మందు బాబులకు కిక్ దిగేందుకు స్థానిక కోర్టు వినూత్న శిక్ష వేసింది. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన 52 మంది మందుబాబులను బీచ్ లో వ్యర్థాలు ఏరివేసి శుభ్రం చేయాలని విశాఖ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది.  కిక్కు దిగేవరకు బీచ్ లో చెత్తంతా ఎత్తాలని ఆర్డర్ వేసింది. 


కిక్ దిగేవరకు చెత్త శుభ్రం


విశాఖలో మందుబాబులకు వింత శిక్షను అమలు చేసింది మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 52 మంది మందుబాబులకు ఆర్కే బీచ్ లోని వ్యర్థాలను, చెత్తను పరిశుభ్రం చేయాలని ఆదేశించింది. దీంతో మందుబాబులంతా వరుసగా ఆర్కే బీచ్ లోకి వచ్చి చెత్తను శుభ్రం చేశారు. విశాఖలోని మెట్రోపాలిటిన్ కోర్టు వేసిన శిక్ష ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో చర్చనీయాంశం అవుతుంది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే జరిమానా, జైలు శిక్ష వేస్తారు. ఆ తరువాత సీజ్ చేసిన మోటారు వాహనాలను ఫైన్లు కట్టి విడిపించుకుంటారు. కానీ కోర్టు ఈ తరహా శిక్షలు వేయడంతో మందుబాబులకు తాగింది మొత్తం దిగిపోయింది. ప్రస్తుతం ఈ అంశం విశాఖ జిల్లాలోపాటు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇలా శిక్షలు పడిన వారంతా బీచ్ లో దర్శనమిచ్చారు. చక్కగా చేతికి గ్లౌజులు వేసుకొని, పోలీసుల పర్యవేక్షణలో బీచ్ లో చెత్తను శుభ్రం చేశారు మందుబాబులు. 


కేరళలో వెయ్యిసార్లు ఇంపోజిషన్ శిక్ష 


డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి కేరళలోని కొచ్చి పోలీసులు షాక్ ఇచ్చారు. విద్యార్థుల తరహాలో మందుబాబులతో ఇంపోజిషన్‌ రాయించారు. ఇటీవల కొచ్చిలో ఓ ప్రైవేట్‌ బస్సు ఢీకొనడంతో బైక్ ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించాడు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు తనిఖీలు చేసి పట్టుబడిన మందుబాబులకు వినూత్న శిక్ష వేశారు. తాగి డ్రైవింగ్‌ చేసిన వారితో ఇకపై తాగి వాహనం నడపను అని వెయ్యి సార్లు ఇంపోజిషన్ రాయించారు. ఇంపోజిషన్‌ రాసినప్పటికీ వారికి అసలు శిక్ష తప్పదని పోలీసులు తెలిపారు.  మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి ఎన్ని హెచ్చరికలు, జరిమానాలు విధించినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయిన పోలీసులు చివరకు ఇలా వినూత్నంగా మందుబాబులను కూర్చోబెట్టి ఇంపోజిషన్ రాయించాయి.  మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేసి, వారి లైసెన్సులను కూడా రద్దు చేయిస్తామని పోలీసులు చెప్పారు.