Where is Chandrababu's oath taking place  :  పన్నెండో తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం మంగళగిరి సమీపంలోని ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద ఓ విశాలమైన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ముఖ్య నేతలతో కలిసి స్థల పరిశీలన చేయనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోడీ కూడా హాజరుకానున్నందున హైవే పక్కనే స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు టీడీపీ నేతలు చెప్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్దఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రముఖులు పాల్గొంటున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లను చేయనున్నారు.            


ఎన్డీఏలో కీలక నేతగా చంద్రబాబు -  దేశవ్యాప్తంగా ప్రముఖులు హాజరు                                   


ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చంద్రబాబునాయుడు కీలకంగా ఉన్నారు. అందుకే ఎన్డీఏ పార్టీలకు చెందిన అందరు నేతల్ని ఆహ్వానించే అవకాశం ఉంది. దాదాపుగా ఇరవై రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానంచే అవకాశాలు. అలాగే పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు .. ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు.. ఈ కారణంగా భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. తొమ్మిదో తేదీనే ప్రమాణం చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ ఆ రోజున మోదీ  ప్రధానమంత్రిగా ప్రమాణం  చేయనున్నారు. అందుకే వాయిదా వేశారు.            


మోదీ 9న ప్రమాణం - 12వ తేదీకి చంద్రబాబు ప్రమాణం మార్పు                                


మోదీ ప్రమాణ స్వకారం తొమ్మిదో తేదీన పూర్తవుతుంది. అప్పటికే స్థలాన్ని ఖరారు చేసి వేగంగా ఏర్పాట్లు చేయనున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ ఏజెన్సీ ఇప్పటికే ఏర్పాట్ల సామాగ్రితో  అమరావతి చేరుకుంది. కౌంటింగ్ కు ముందే ఏర్పాట్లు చేసేందుకు సామాగ్రి వచ్చినప్పటికీ స్థలం ఎక్కడ అన్నది ఫైనల్ చేయలేదు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బిజీగా ఉండటంతో ఫైనల్ చేయలేకపోయారు. టీడీపీ నేతలు ఇప్పుడు ఆ పనిలో ఉన్నారు. జాతీయ స్థాయి అగ్రనేతలు వస్తున్నందున విమానాశ్రయం నుంచి రాకపోకలకు అనువుగా ఉండే ప్రదేశాన్ని ఏంపిక చేసుకుంటున్నారు.              


జాతీయ రహదారి పక్కనే సభ                  


ఎయిమ్స్ వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ప్రమాణ స్వీకార వేదికను ఏర్పాటు  చేసే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సంచలన విజయాలను సాధించింది. నిన్నటి వరకూ అధికారపార్టీగా ఉన్న వైఎస్ఆర్‌సీపీకి పదకొండు అసెంబ్లీ సీట్లు మాత్రమ వచ్చాయి. అంటే ప్రతిపక్ష హోదా కూడా రాలేదు.