Chandrababu Speech In NDA 3.0 Meeting: మోదీ నేతృత్వంలో భారత్ 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఎన్డీయే లోక్ సభా పక్ష నేతగా మోదీ పేరును ప్రతిపాదించగా ఆయన టీడీపీ తరఫున సమర్థించారు. ఎన్డీయే ఎంపీలు ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్‌లో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సమావేశానికి 240 మంది బీజేపీ ఎంపీలతో పాటు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్‌జనశక్తి (రాంవిలాస్), ఎన్‌సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీయే పార్టీల మంత్రులు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. 




మోదీపై చంద్రబాబు ప్రశంసలు




ఎన్డీయేను అధికారంలోకి తేవడానికి మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని.. భారతదేశానికి సరైన సమయంలో సరైన నాయకత్వం దొరికిందని టీడీపీ అదినేత చంద్రబాబు ప్రశంసించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రచారం చివరి వరకూ మోదీ నిరంతం శ్రమించారని చెప్పారు. 'ఏపీలోనూ 3 బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో 90 శాతం స్థానాలు గెలిచాం. విజనరీ నాయకుడి నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారు. భారత్ ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. సరైన సమయంలో సరైన వ్యక్తి ప్రధాని కావడంతో దేశం పురోభివృద్ధి సాధించింది. మేకిన్ ఇండియాతో భారత్‌ను ఆయన అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్టను ఇనుమడింప చేశారు. మోదీ నాయకత్వంలో దేశం పేదరిక రహితంగా మారుతుంది.' అని చంద్రబాబు కొనియాడారు.


Also Read: NDA 3.0 Meeting: మూడోసారి NDA పక్షనేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక, ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్