Chandrababu First Signature On Mega Dsc: డీఎస్సీ.. లక్షలాది మంది నిరుద్యోగుల కల. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉత్తమమైన ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని ప్రతి ఒక్క యువత కోరుకుంటారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అడుగులు పడబోతున్నాయి. నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులను ఆకర్షించేలా.. అభివృద్ధి, ఉపాధి వంటివే ధ్యేయంగా.. కూటమి తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 12న ఏపీ సీఎంగా అమరావతిలో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత హామీలు నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టనున్నారు. అయితే, ఆయన తొలి సంతకం చేయబోయే ఫైల్‌పై అంతటా ఉత్కంఠ నెలకొంది.


ఫస్ట్ సైన్.. మెగా డీఎస్సీ


అవును.. ఫస్ట్ సైన్ మెగా డీఎస్సీపైనే. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే తొలి సంతకం డీఎస్సీపైనే అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. వెనువెంటనే టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేయాలని యత్నించింది. అయితే, నిరుద్యోగులు తగినంత సమయం ఇవ్వడం లేదని హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నిరుద్యోగ యువతపై ఫోకస్ పెట్టారు. అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికిషేన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో నిరుద్యోగులు ఎక్కువగా కూటమి వైపు మొగ్గు చూపారన్నది విశ్లేషకుల మాట. కూటమి అఖండ విజయంతో ఇక నిరుద్యోగుల కల.. మెగా డీఎస్సీకి మార్గం సుగమం అవుతోందని చెబుతున్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేయనుండగా.. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించి సంపద సృష్టించి నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై కూడా చంద్రబాబు ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు.


రెండో సైన్.. దేనిపై అంటే.?


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ఎన్నికలకు ముందు ఇంతలా చర్చనీయాంశమైన అంశం మరొకటి లేదు. భూహక్కు చట్టం ద్వారా ప్రభుత్వం భూముల్ని లాక్కొనే ప్రయత్నం చేస్తుందన్న కూటమి నేతల వాదనలతో గ్రామీణ, అర్బన్ ఓటర్లు ఏకీభవించారు. అంతేకాకుండా ల్యాండ్ పాస్ బుక్‌పై అప్పటి సీఎం జగన్ ఫోటో ఉండడంపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఈ క్రమంలో అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండో సంతకం దానిపైనే చేస్తామంటూ స్పష్టం చేశారు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సైన్ చేయనున్నారు.


మూడో సైన్.. పెరగనున్న పింఛన్


పెన్షన్.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వంటి వారికి ప్రభుత్వం నెలా నెలా అందించే లబ్ధి. వైసీపీ అధినేత జగన్ హయాంలో రూ.2 వేల నుంచి దశలవారీగా రూ.3 వేలకు పెంచారు. ఈ క్రమంలో పెన్షనర్లకు ఊరటగా అధికారంలోకి రాగానే.. పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెరిగిన పెన్షన్‌ను ఏప్రిల్ నుంచే అందిస్తామన్నారు. ఈ క్రమంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పెన్షన్ల పెంపుపైనే మూడో సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పెన్షనర్లకు భారీగా లబ్ధి చేకూరనుంది.