Andhra Pradesh: బాపట్ల మాజీ ఎంపీ వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఓ రహస్య ప్రాంతంలో ఉన్న ఆయన్ని విజయవాడ పోలీసులు అరెస్టు చేసి తరలిస్తున్నారు.అమరావతిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనతోపాటు మరికొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, నందిగం సురేష్‌ ఈ కేసులో నిందితులుగా పోలీసులు చేర్చారు. ఇప్పిటకే కొందరు అరెస్టు అయ్యి బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పుడు కీలక నేతలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఆ రోజు నేతలు చేసిన ఫోన్ కాల్స్ ఆధారంగా ఈ కేసు విచారణ చేస్తున్నారు. 


కోర్టుల్లో చుక్కెదురు


ఈ కేసులో నిందితులుగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, నందిగం సురేష్‌ ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. వివిధ కోర్టుల్లో ప్రయత్నాలు చేశారు. చివరకు హైకోర్టులో వారికి ఊరట లభించలేదు. అంతేకాకుండా సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు వెసులుబాటు కల్పించాలని ఎలాంటి అరెస్టులు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించినా ప్రయోజనం లేకపోయింది. దీనికి కూడా కోర్టు అంగీకరించలేదు. 


పరారీలో నేతలు 


దీంతో ఒకట్రెండు రోజుల్లోనే నిందితులను అరెస్టు చేస్తారని అంతా భావించారు. కానీ కోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చిన వెంటనే లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, నందిగం సురేష్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న చాలా మంది వైసీపీ లీడర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 


కోర్టు తీర్పు రావడంతో సురేష్ కూడా ఎస్కేప్


ఈ కేసులో ఇప్పటికే వివిధ కారణాలతో నిందితులకు చాలా సమయం ఇచ్చామని పోలీసులు చెబుతున్నారు. నిందితులు కూడా కోర్టుల నుంచి వెసులుబాటు తీసుకున్నారని అందుకే వేచి చూసామని అంటున్నారు. ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకోవడానికి అంగీకరించకపోవడంతో అరెస్టులు చేస్తున్నట్టు చెబుతున్నారు. 
హైకోర్టు తీర్పు అనంతంర సురేష్‌ను ప్రశ్నించడం కోసం ఉద్దండయారునిపాలెంలోని ఆయన ఇంటికి వెళ్తే అక్కడ లేనట్టు పోలీసులు గుర్తించారు. చాలా సమయం అక్కడ ఎదురు చూసినా ఆయన ఆచూకీ దొరకలేదు. కుటుంబ సభ్యులు కూడా ఏం చెప్పలేదు. అక్కడి నుంచి వెనుదిరిగి వచ్చేసిన పోలీసులు సాంకేతిక సాయంతో సురేష్‌ ఆచూకీ కనుగొన్నారు. 


కోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చిన వెంటనే అరెస్టు భయంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసినట్టు తేల్చారు. ఆఖరి సెల్‌ఫోన్ సిగ్నల్ ఎక్కడ ఉందో తెలుసుకొని దాని ఆధారంగానే సురేష్ హైదరాబాద్‌లో ఉన్నట్టు తేల్చారు. హైదరాబాద్‌ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు వెంటే యాక్షన్‌లోకి దిగారు. 


హైదరాబాద్‌లో ఉన్నారని పక్కా సమాచారంతో ఆయన్ని అరెస్టు చేశారు. సురేష్‌ను అదుపులోకి తీసుకున్న ప్రత్యేక పోలీస్ టీం...ఆయన్ని గుంటూరు జిల్లాకు తరలిస్తున్నారు. ఆయనతోపాటు ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయవాడ డిప్యూటీ మేయర్‌ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని కూడా ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
 


Also Read:  తెలంగాణలో హైడ్రాలాగా బుడమేరు ఆక్రమణలు తొలగించాలి - షర్మిల డిమాండ్