Vijayawada News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. విజయవాడలోని సింగ్ నగర్ లో వరద బాధితులను కలిశారు. ఇంకా మోకాళ్ల లోతున ఉన్న వరద నీటిలో దిగి.. ఇంటింటికీ తిరుగుతూ వారికి నిత్యావసరాలు పంచి పెట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. బుడమేరు ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న హైడ్రా తరహాలో వ్యవస్థ ఇక్కడ కూడా తేవాలని సూచించారు. వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం అని.. బాధితులు పడుతున్న కష్టాలు స్వయంగా చూసి నా గుండె తరుక్కుపోయిందని షర్మిల అన్నారు. వరదల్లో ఇప్పటికీ 35 మంది చనిపోయారని.. 35వేల ఇళ్లు కూలిపోయాయని షర్మిల అన్నారు. మొత్తం 5 లక్షల మంది దాకా నష్టపోయారని.. ఇంత భారీ ఎత్తున విపత్తు సంభవిస్తే ప్రధాని మోదీ కనీసం స్పందించలేదని షర్మిల అన్నారు.


‘‘కొంప కొల్లేరు అయ్యింది.. బెజవాడ బుడమేరు అయింది. సింగ్ నగర్ లో వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం. బాధితులు పడుతున్న కష్టాలు స్వయంగా చూసి నా గుండె తరుక్కుపోయింది. వరదల్లో ఇప్పటికీ 35 మంది చనిపోయారు. 35వేల ఇళ్లు కూలిపోయాయి. మొత్తం 5 లక్షల మంది దాకా నష్టపోయారు. ఇంత భారీ ఎత్తున విపత్తు సంభవిస్తే ప్రధాని మోడీ కనీసం స్పందించలేదు. విజయవాడ వరదలు కేంద్రానికి కనిపించడం లేదా..? తక్షణమే దీనిని జాతీయ విపత్తుగా పరిగణించండి. 


వరదల్లో సీఎం చంద్రబాబు చేస్తున్న సహాయక చర్యలు సంతోషకరం. కానీ సహాయక చర్యలు గ్రౌండ్ లెవల్‌కి చేరడం లేదు. 2005లో ఇలాంటి వరదలు వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఇక్కడకు వచ్చారు. బుడమేరు వరదలు రాకుండా సమస్య పరిష్కారం చేయాలని చూశారు. ఆపరేషన్ కొల్లేరును క్లియర్ చేశారు. ఆరోజుల్లో బుడమేరు కట్టలు బలోపేతం చేశారు. కానీ గత 10 ఏళ్లలో బుడమేరులో ఆక్రమణలు జరిగాయి. తెలంగాణలో హైడ్రా మాదిరిగా బుడమేరు ఆక్రమణలు తొలగించి రిటర్నింగ్ వాల్ కట్టాలి’’ అని వైఎస్ షర్మిల అన్నారు.