YS Jagan Mohan Vs YS Sharmila: వైఎస్‌ జగన్, షర్మిల మధ్య ఉన్నది రాజకీయ జగడం కాదని... ఆస్తుల పంచాయితీ అనే విషయం తాజాగా వెలుగు చూస్తోంది. గతంలో చెల్లెలకు తన కంపెనీల్లో వాటా ఇచ్చేందుకు అంగీకరించిన జగన్‌.... తర్వాత నో చెబుతున్నారు. ఇదే విషయంపై ఇప్పుడు న్యాయపోరాటానికి సైతం దిగారు. దీనికి సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. 


వైఎస్ కుటుంబంలో చెలరేగిన ఆస్తుల వివాదం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. తన కంపెనీల్లో షర్మిల, విజయమ్మకు వాటా ఇచ్చే ఉద్దేశం లేదని, గతంలో చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకుంటామని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ వైఎస్‌ జగన్, భారతీ పిటిషన్‌ వేయడం సంచలనాలకు దారి తీస్తోంది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటాల విషయంలో తాజాగా నెలకొన్న వివాదంపై ఈ పిటిషన్ దాఖలు చేశారు. 


తెలంగాణలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, సౌత్ ఈస్ట్ రీజియన్ రీజినల్ డైరెక్టర్‌ సహా జనార్దన రెడ్డి చాగరి, యశ్వంత్‌రెడ్డి కేతిరెడ్డి, ఇతరుల పేర్లను ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వివాదం తాజాగా ఎన్‌సిఎల్‌టిలో లిస్ట్ అయింది. కంపెనీల చట్టంలోని సెక్షన్ 59 కింద దీనిని విచారించారు. దీని ప్రకారం ఒక వ్యక్తి పేరు తగిన కారణం లేకుండా కంపెనీ సభ్యుల రిజిస్టర్‌లో నమోదు చేయడం కానీ తొలగించడానికి కానీ, సరిదిద్దడానికి అప్పీల్‌ చేసుకోవచ్చు. ఇప్పుడు జగన్ అండ్ కో చేసింది ఇదే. తన కంపెనీల్లో వాటాదారుల పేర్లు తొలగించి సరిదిద్దాలన్న విజ్ఞప్తితో పిటిషన్ వేశారు. 


సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్‌ కోసం చాలా కష్టపడ్డామని జగన్, భారతి పిటిషన్‌లో వాదించారు. అయితే ఇందులో షర్మిలకు వాటాలు ఇవ్వాలి తాము 2019 ఆగస్టు 21న ఎంఓయూపై సంతకాలు చేసుకున్నారు. అయితే వాటాల కేటాయింపు ఇంకా పూర్తి కాలేదని చెప్పుకొచ్చారు. ఇదే ప్రస్తుత వివాదానికి కారణమైంది.  వైఎస్ కుటుంబంలో వివాదాలను ఈ పిటిషన్ తెలియజేస్తుంది. "సోదరి అనే అనురాగంతో షర్మిలకు సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లోవాటాలు ఇచ్చేందుకు అంగీకరించాను. ఇటీవల రాజకీయంగా ఆమెకు నాపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఆ ఆఫర్‌ను వెనక్కి తీసుకుంటున్నాను. అని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 


ఈ కేసులో నాలుగు మధ్యంతర పిటిషన్లు కూడా జగన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా NCLT ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ నవంబర్ 8న జరగుంది. ఈ మధ్య కాలంలో అన్న చెల్లెల మధ్య వివాదాలు కొలిక్కి వచ్చాయని వార్త వైరల్ అవుతుంది. ఇంతలో ఈ పిటిషన్ వెలుగులోకి రావడం ఆసక్తి రేపుతోంది. ఇన్ని రోజులు రాజకీయంగా ఇరువురు మధ్య విభేదాలు ఉన్నాయని అంతా అనుకున్నారు కానీ అందులో ఆస్తుల పంచాయితీ కూడా ఉందని ఇప్పుడు ఈ పిటిషన్ చూస్తే అర్థమవుతుంది.  


Also Read: జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?