YS Sharmila to meet YS Jagan: వైఎస్ షర్మిల నేడు (జనవరి 3) సీఎం జగన్ ను కలవనున్నారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో రేపు  షర్మిలా రెడ్డి కుటుంబ సభ్యులు గన్నవరం చేరుకొని, సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని సోదరుడు, ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్లనున్నారు. కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్ మోహన్ రెడ్డికి షర్మిలా రెడ్డి అందించనున్నారు. వైఎస్ షర్మిల వెంట తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ అట్లూరి, కుమార్తె, కోడలి తరపు కుటుంబ సభ్యులు కూడా జగన్ వద్దకు వెళ్లనున్నారు. వివాహ ఆహ్వాన పత్రిక అందించిన తర్వాత సాయంత్రం విజయవాడ నుంచే నేరుగా ఢిల్లీకి పయనం కానున్నట్లు తెలుస్తోంది. 


ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో షర్మిల చర్చలు జరిపే అవకాశం ఉంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపడతారనే ప్రచారం నేపథ్యంలో ఆమె ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే షర్మిల మరో రెండు రోజుల్లో అన్ని వివరాలు చెబుతానని ప్రకటించారు. కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా కూడా చెప్పారు.


కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటన


కాంగ్రెస్‌లో చేరుతున్నానని షర్మిల ప్రకటించారు. కుటుంబ సమేతంగా ఇడుపుల పాయ వైఎస్ఆర్ (YSR Ghat) ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.  కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ మొదటి పత్రికను వైఎస్ఆర్ (YSR Ghat) ఘాట్ వద్ద ఉంచారు. ఈ తర్వాత మీడియాతో మాట్లాడారు.  డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుందని..  ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధి వద్ద వివాహ పత్రికను ఉంచి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందన్నారు. వైఎస్సార్ తో పాటు ప్రజలందరి దీవెనలు కొత్త దంపతులపై ఉండాలని కోరుకున్నారు. 


కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయం! 


కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయించామని షర్మిల తెలిపారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామన్నారు.  ఇవ్వాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందన్నారు.  కేసీఅర్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ టీపీ (YSRTP) చాలా పెద్ద పాత్ర పోషించిందని గుర్తు చేశారు. 31 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 10 వేల లోపు మెజారిటీతోనే గెలిచారని..  దీనికి కారణం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయక పోవడమేనన్నారు. వైఎస్ఆర్టీపీ (YSRTP) ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ కి ఇబ్బంది అయి ఉండేదని గుర్తు చేశారు. 


ఏపీ పాలిటిక్స్‌లోకి షర్మిల ఎంట్రీపై 4న నిర్ణయం
జనవరి 4వ తేదీ ఉదయం 11 గంటలకు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు. షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే, షర్మిలకు ఏఐసీసీ పదవి అప్పగిస్తారా? ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగిస్తారా? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతుంది. రాహుల్ గాంధీ షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అలాకాకుంటే ఏఐసీసీ, సిడబ్ల్యుసీలో ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.