Posani Krishna Murali Comments on Nara Lokesh: ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మరోసారి ఎప్పటిలాగే సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మను చంపడం కోసం టీడీపీ ప్లాన్ వేసిందని సంచలన ఆరోపణలు చేశారు. నారా లోకేష్‌, రాజేశ్ కిలారు, ఇతర అనుచరుల ఆధ్వర్యంలో ఈ కుట్ర జరిగిందని పోసాని ఆరోపించారు. అందుకు లోకేశ్ కూడా ఒప్పుకున్నప్పటికీ.. చివరి నిమిషంలో చంద్రబాబు వద్దని చెప్పడం వల్లే ప్లాన్ ఆగిపోయిందని పోసాని చెప్పారు. ఈ కుట్ర విషయాన్ని కిలారు రాజేష్ మనుషులు తనకు చెప్పినట్లుగా పోసాని వివరించారు. ఈ విషయాన్ని తాను పార్టీ పెద్దల ద్వారా పైకి తీసుకెళ్తానని.. దీనిపై పోలీసుల విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు నిజం కాకపోతే.. వాళ్లు తనపై కేసు పెట్టొచ్చని పోసాని సవాలు విసిరారు. సోమవారం పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌పైన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


ఎన్నికలలో గెలవడం కోసం వారు ఎంతకైనా తెగించటానికి రెడీగా ఉన్నారని పోసాని అన్నారు. సీఎం జగన్‌తో పాటు ఆర్జీవీని చంపాలని యత్నించారని.. అందుకే సీఎం జగన్‌పైకి రాయి విసిరారని అన్నారు. అది కంటికి తగిలి ఉంటే కచ్చితంగా ప్రాణం పోయి ఉండేదని పోసాని ఆవేదన చెందారు. అయినా సీఎంనే చంపాలనుకున్నవాళ్లకు తాము ఒక లెక్కా? అని ప్రశ్నించారు. కావాలంటే తన లాంటి వాడిని చంపినా ఏమీ కాదని.. ప్రజల మనిషి అయిన జగన్‌ను మాత్రం ఏం చేయొద్దని అన్నారు.


Also Read: కంట్లో కారం చల్లి, పెళ్లి కూతుర్ని కిడ్నాప్ యత్నం- సంచలన వీడియో


పవన్ కల్యాణ్ కు మెంటల్ - పోసాని
పవన్‌ కళ్యాణ్‌ ఓ మెంటల్‌ కేసు అని పోసాని వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రోజురోజుకి పవన్ కల్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో వాలంటీర్లు, మహిళలను కించపరిచేలా మాట్లాడలేదా? అని ప్రశ్నించారు. కొన్నేళ్ల క్రితం చంద్రబాబు, లోకేష్‌పై పవన్ కల్యాణ్ విమర్శలు చేశారని గుర్తు చేశారు. రాజకీయాల్లో లబ్ధి కోసమే పవన్‌ ఇదంతా చేస్తున్నారని.. చంద్రబాబుని పవన్ వెన్నుపోటుదారుడని అనలేదా? అని నిలదీశారు. అలాగే నారా లోకేష్‌ను తిండిబోతు అని పవన్‌ అన్నారని గుర్తు చేశారు. లోకేష్ తన అవినీతితో రాష్ట్రాన్ని మింగేశాడని పవన్ విమర్శించారని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ తీరు, ఆయన గురించి మాట్లాడటం సిగ్గు చేటని పోసాని అన్నారు. 


కాపుల్లో ఎవరూ సీఎంగా పనికిరారు అని తేల్చేసి.. చంద్రబాబును గద్దె ఎక్కించడానికి పవన్‌ కల్యాణ్ రెడీ అయ్యారని అన్నారు. కాపులందరి ఓట్లనూ చంద్రబాబుకు వేయించాలని పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తాను సీఎంగా పనికిరానని చెప్పుకుంటున్నారు. పవన్ కల్యాణ్ హోల్‌సేల్‌గా కాపులందరినీ తాకట్టు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని పోసాని అన్నారు. చిరంజీవి గతంలో ప్రజా రాజ్యం పార్టీ నుంచి 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని.. ఆయన సంతృప్తి చెందకుండా కాపులకు ఒక్క మాట కూడా చెప్పకుండా తన పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసేసుకున్నారని పోసాని అన్నారు.


Also Read: 'టెన్త్' ఫెయిల్ ఫికర్ వద్దు, నెలరోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు - ఎప్పటినుంచంటే?