NTR District News: ఎన్టీఆర్ జిల్లాలోని చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. రెండు కుటుంబాల మధ్య తలెత్తిన గొడవ తీవ్ర వివాదాలకు దారి తీసింది. పాత గొడవలు, కక్ష్యల నేపథ్యంలో ఇరు కుటుంబాలు కర్రలు, గొడ్డళ్లు, యాసిడ్ తో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు గాయపడ్డారు.


అసలేం జరిగిందంటే..?


తుర్లపాడు గ్రామంలో ఉన్న రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. ఎప్పుడూ వీరి మధ్య ఏదో రకంగా గొడవ జరిగేది. అయితే తాజాగా వీరి మధ్య ఆదివారం రోజు ఉదయం వాగ్వాదం చెలరేగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రెండు కుటుంబాల యజమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అందిన వాటితో కొట్టుకున్నారు. కర్రలు, గొడ్డళ్లతో చెలరేగిపోయారు. ఈక్రమంలో ఓ కుటుంబంలోని సభ్యులు యాసిడ్ తెచ్చి ప్రత్యర్థి కుటుంబం దాడి చేశారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు యాసిడ్ దాడికి గురికాగా.. ఇద్దరికి కర్రలతో కొట్టడం వల్ల గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వీరిని ఆపి వెంటనే నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే పోలీసులకు కూడా సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.