Chandrababu Oath taking Ceremony: ఏపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లే క్రమంలో జనసేన కార్యదర్శి నాగబాబుకు కాస్త ఇబ్బంది ఎదురైంది. వేదిక వద్దకు వెళ్లే క్రమంలో భద్రతా సిబ్బంది నాగబాబును అడ్డుకున్నారు. అదే సమయంలో నాగబాబు వెంట పవన్ కల్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్యా కూడా ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది వీరిని నేరుగా వెళ్లనివ్వకుండా కాసేపు నిలువరించడంతో నాగబాబు ఒకింత అసహనానికి గురయ్యారు. భద్రతా సిబ్బందిపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఈవైపు దారి లేదని.. మరోవైపు నుంచి వెళ్లాలని భద్రతా సిబ్బంది నాగబాబుకు సూచించారు. తనకు అవసరం లేదని అకీరా, అద్యలతో కలిసి వెళ్ళిపోతున్న నాగబాబును పోలీసులు వెనక్కి పిలుచుకుని వచ్చారు. ఇంతలో అక్కడికి ఓ భద్రతా అధికారి చేరుకొని నాగబాబు, అకీరా నందన్, ఆద్యాలను లోనికి అనుమతించారు. వేదిక వద్ద తమకు ప్రత్యేకంగా ఓ గ్యాలరీ ఉందని.. తమను అనుమతించకపోవడం ఏంటని నాగబాబు సెక్యూరిటీ అధికారిని ప్రశ్నించారు. కాసేపు అక్కడే నిలబడ్డ నాగబాబు, అకీరా నందన్, ఆద్యాలతో ఫోటోలు దిగేందుకు చుట్టుపక్కల జనం ఎగబడ్డారు. అకీరాను చూసి కేరింతలు కొట్టారు.