Minister RK Roja: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తో పాటు భువనేశ్వరి, బ్రహ్మణిలపై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. విజయవాడలోని తుమ్మలపల్లిలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి రోజా.. చంద్రబాబు, లోకేష్ సహా భువనేశ్వరి, బ్రహ్మణిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ రాష్ట్రపతిని కలిసిన అంశంపైనా మంత్రి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ ఏనాడూ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవని.. తప్పు చేసిన తన తండ్రిని కాపాడుకోవడానికి మాత్రం కలిశారని ఎద్దేవా చేశారు. లోకేష్ ఢిల్లీలో మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికి తెగ తిరుగుతున్నాడని.. కానీ, అడ్డంగా దొరికిన నారా చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరని మంత్రి రోజా పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా కనీసం లోకేష్ కు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవద్దా అంటూ పర్యాటక శాఖ మంత్రి మండిపడ్డారు.


మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక కుంభకోణాలు చేశారని మంత్రి రోజా ఆరోపించారు. రోడ్డు వేయకముందే ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ పేరుతో దోచుకున్నారని అన్నారు. 6 నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెబుతుంటే అందరూ నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. కుంభకోణాల్లో ఇరుక్కున్న లోకేష్.. ఢిల్లీ పారిపోయాడని విమర్శలు గుప్పించారు. కాళ్ల నుంచి కళ్ల వరకూ భయంతో లోకేష్ వణికిపోతున్నాడని మంత్రి ఆర్కే రోజా సెటైర్లు వేశారు. ఎర్ర బుక్ లో రాసుకుంటానని బెదిరిస్తున్న నారా లోకేష్.. సీఐడీ మెమోలో ఆయన పేరు రాశారని గుర్తు ఉంచుకోవాలని చెప్పుకొచ్చారు. హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితేనే 400 కోట్లు వస్తాయని భువనేశ్వరి చెబుతున్నారని.. అంటే చంద్రబాబు ఆస్తి 20 వేల కోట్లా అని ఆర్కే రోజా నిలదీశారు. ఈ ఆస్తుల విషయం చంద్రబాబు తన అఫిడవిట్ లో స్పష్టం చేశారా అని మంత్రి రోజా ప్రశ్నించారు.


కర్జూర నాయుడు చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి చెరో ఎకరం భూమి మాత్రమే ఇచ్చారని.. అక్కడి నుంచి లక్షల కోట్లకు చంద్రబాబు ఆస్తి ఎలా పెరిగిందని మంత్రి రోజా ప్రశ్నించారు. హైదరాబాద్ లో చంద్రబాబు ఇల్లు రూ. 600 కోట్లు అని చెప్పిన ఆర్కే రోజా.. భువనేశ్వరి, లోకేష్ 118 కోట్ల రూపాయల నోటీసులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాల్లో ఉంటున్న తెలుగు వారందరూ.. చంద్రబాబు పాల్పడ్డ కుంభకోణాల గురించి తెలుసుకోవాలని మంత్రి రోజా సూచించారు. భువనేశ్వరి, బ్రహ్మణి అబద్ధాలు చెబుతుంటే.. ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుందని అన్నారు. చంద్రబాబు టీమ్ వర్క్ గా కుటుంబ సభ్యులు అంతా దోపిడీలో భాగస్వామ్యం అయినట్టు ప్రజలకు స్పష్టంగా అర్థం అయిందని మంత్రి ఆర్కే రోజా సంచలన కామెంట్లు చేశారు.