Budameru Canal Repairs: బుడమేరు వాగుకు వస్తున్న వరద ఉధృతిపై మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు మరింత వేగవంతం అయ్యేలా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో గండ్లు పడిన చోట 500 క్యూసెక్కుల నుంచి 200 క్యూసెక్కులకు సీపేజ్ లీకేజ్ తగ్గిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. 


ఆ మిగిలిన లీకేజ్ కూడా పూర్తి స్థాయిలో లీకేజ్ అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో లీకేజ్ ను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు జియో మెంబ్రేన్ షీట్ ను అధికారులు వినియోగిస్తున్నారు. సాయంత్రానికి పూర్తి స్థాయిలో లీకేజ్ అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. బుడమేరులో వస్తున్న వరదను అంచనా వేస్తూ గండ్లు పూడ్చిన చోట కట్ట ఎత్తు పెంచే పనులు వేగవంతం చేశారు.


ఇప్పటికే గండ్లు పడిన చోట 5.7 మీటర్ల ఎత్తు పెంచారు. మరో 0.3 మీటర్ల ఎత్తు పెంచితే ప్రస్తుత కట్ట స్థాయికి పనులు పూర్తి అవుతాయని అధికారులు వెల్లడించారు. ఎప్పటికప్పుడు బుడమేరు వద్ద జరుగుతున్న పనులను డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ పనులు వేగవంతం చెయ్యడానికి వివిధ శాఖల అధికారులతో నారా లోకేష్ సంప్రదింపులు చేస్తున్నారు. మరోపక్క వరద బాధితులకు అందుతున్న సహాయం, నష్ట పరిహార అంచనాపైన కూడా మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు.


ఇతర శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నష్ట పరిహార అంచనా పక్కాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 36 మంది ప్రజాప్రతినిధులను నష్ట అంచనా పర్యవేక్షణకు నియమించారు. ఒక పక్క బాధితులకు సహాయం అందిస్తూనే మరోవైపు నష్ట అంచనా వేగంగా పూర్తి చేయ్యడానికి చర్యలు తీసుకుంటున్నారు.