Lalithaa Jewelers Donates 1 Crore to AP CM Relief Fund: లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్. కిరణ్ కుమార్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. ఏపీలోని విజయవాడను అతలాకుతలం చేసిన వరదల నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం భారీ విరాళాన్ని అందించారు. ఏకంగా ఆయన రూ.కోటి విరాళం అందించారు. సీఎం చంద్రబాబు నాయుడును స్వయంగా కిరణ్ కుమార్ కలిసి రూ.కోటి చెక్కును అందించారు. సోమవారం విజయవాడ కలెక్టరేట్ కు చేరుకున్న కిరణ్ కుమార్ చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ ను సీఎం చంద్రబాబు అభినందించారు.


ఆ తర్వాత కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు చేస్తున్న పరిపాలనను కొనియాడారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం చంద్రబాబు 75 ఏళ్ల వయసులోనూ కష్టపడుతున్నారని ప్రశంసించారు. ఆయన కనీసం ఇంటికి కూడా వెళ్ళకుండా బస్సులోనే బస చేస్తూ, కలెక్టరేట్ లోనే ఉంటూ వరద బాధితుల కోసం పని చేస్తున్నారని అన్నారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ తమకు వీలైనంత సాయం చేయాలని కోరారు. డబ్బులు ఎవరికీ ఊరికే రావని.. ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉంటుందని కిరణ్ కుమార్ చెప్పారు.