కన్నా లక్ష్మీనారాయణ సెంట్రిక్‌గా ఏపీలో పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కన్నాతో సీనియర్‌ నేతల భేటీ కాక రేపుతోంది. ఈ భేటీలన్నీ ఒకే రోజు గంటల వ్యవధిలోనే జరగడం ప్రాధాన్యత ఏర్పడింది. 


వెల్లంపల్లి కుమార్తె వివాహానికి వచ్చిన గంటా శ్రీనివాస రావు బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమయ్యారు. దీనికి పెద్ద రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతున్నప్పటికీ కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తోంది. ఈ భేటీపై రెండు వర్గాలకు చెందిన వారెవరూ నోరు విప్పడం లేదు. సమావేశం నుంచి వెళ్తూ వెళ్తూ మీడియాతో మాట్లాడిన గంటా శ్రీనివాస రావు కన్నా లక్ష్మీనారాయణతో భేటీకి పెద్దగా ప్రాధాన్యత లేదన్నారు. మా సమావేశంలో రాజకీయ చర్చ అసలు జరగలేదని చెప్పుకొచ్చారు. వెల్లంపల్లి కుమార్తె పెళ్లికి వచ్చి ఇక్కడ కలిశామన్నారు. తాను పార్టీ మారితే అందరికీ చెప్పే చేస్తానన్నారు గంటా శ్రీనివాస రావు. విశాఖలో ఈ నెల 26 న జరిగే రంగా వర్థంతి సమావేశంపై కూడా ఇద్దరి మధ్య ఎలాంచి ప్రస్తావన రాలేదన్నారు. 


కన్నా లక్ష్మీనారాయణతో భేటీకి ముందు తెలుగుదేశంలో ఉన్న కాపు నేతలతో గంటా భేటీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. వీళ్లంతా వరుసగా సమావేశమవుతూ ఏం చర్చిస్తున్నారనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. ఎవరూ ఎలాంటి లీకులు ఇవ్వడం లేదు. పక్కగా సీక్రెట్‌గా సాగుతున్నాయీ చర్చలు. 


గంటా భేటీ కాక ముందే కన్నాతో జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. ఈ రెండు భేటీలు ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే జరగడం రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ కొన్ని రోజులగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, గంటా శ్రీనివాస రావు కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి రావడం చర్చనీయాంశంగా మారింది. 


కొంతకాలం నుంచి సోము వీర్రాజు నాయకత్వంపై కన్నా లక్ష్మీ నారాయణ అసంతృప్తిగా ఉన్నారని పార్టీ శ్రేణుల తీరుతో అర్థమవుతోంది. జనసేన రోడ్ మ్యాప్ విషయంలో సోము వీర్రాజు తీరును ఖండించారు. ఏపీలో పార్టీ వ్యవహారాలపై ఢిల్లీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం వైఫల్యం చెందిందని ఇటీవల కన్నా వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ తరుణంలో నేతల వరుస భేటీపై పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.


గత కొంతకాలం నుంచి తమ పార్టీపై అసంతృప్తితో ఉన్న బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణను జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్లతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గుంటూరులోని కన్నా ఇంటికి వెళ్లిన నాదెండ్ల దాదాపు 40 నిమిషాలకు పైగా భేటీ అయి పలు అంశాలు చర్చించుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, సమకాలీన అంశాలపై చర్చించుకున్నారు. తమ భేటీ తరువాత నాదెండ్ల మనోహర్ సైతం ఈ విషయాన్ని చెప్పారు. అయితే వీరి భేటీకి ముందు బీజేపీ, జనసేన నేతలు కొంత సమయం చర్చలు జరిపారు. కన్నా, నాదెండ్ల భేటీ విషయం బయటకు రాగానే, పార్టీ మారతారని బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడిపై జోరుగా ప్రచారం జరిగింది. చిన్న విషయం అయితే కన్నా అభిమానులు సైతం పెద్ద ఎత్తున ఆయన ఇంటికి ఎందుకు వచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో  బీజేపీ, టీడీపీలతో పొత్తుల సమీకరణాలపై నడుస్తూనే పార్టీని బలోపేతం చేసుకునే దిశగా జనసేన అడుగులు వేస్తోంది. 


నాదెండ్ల ఏమన్నారంటే..
కన్నాతో భేటీ అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేశారని అన్నారు. వైఎస్సార్ సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేస్తామన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు రావాలని ఆకాంక్షించారు. ఏమైనా అప్‌డేట్ ఉంటే త్వరలో చెబుతామన్నారు. జిల్లాల్లో ఇంకా ఏ నేతలైనా జనసేన కలవనుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు.