Eluru Government Hospital: నెలలు నిండిన ఓ మహిళ కాన్పు కోసం సర్కారు దవాఖానాకు వచ్చింది. అయితే అన్నీ పరీక్షించిన వైద్యులు సీ సెక్షన్ చేసి మరీ బిడ్డను బయటకు తీశారు. అయితే కుట్లు వేస్తున్న క్రమంలో కడుపులోనే కత్తెర మరిచిపోయారు. ఆమె తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతుండడంతో.. మరోసారి వైద్యులు స్కాన్ చేశారు. కడుపులో కత్తెర ఉండడం చూసి షాకయ్యారు. వెంటనే మరోసారి శస్త్ర చికిత్స చేసి కత్తెరను బయటకు తీశారు. అయితే విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి వారం రోజుల క్రితం ఓ మహిళ కాన్పు కోసం వచ్చింది. పరీక్షలు నిర్వహించిన ఓ సీనియర్ సివిల్ సర్జన్ ఆమెకు సిజేరియన్ చేసి పండంటి బిడ్డను బయటకు తీశారు. అప్పటి నుంచి ఆమె తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతోంది. దీంతో వైద్యులు ఎక్స్ మరోసారి ఎక్స్ రే తీయించారు. కడుపులో కత్తెర ఉన్న విషయం గుర్తించి వెంటనే ఆమెకు శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించారు. అయితే విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడే పని చేసే ఓ ఉద్యోగి.. కడుపులో కత్తెర ఉన్న స్కానింగ్ ఫొటోను తన ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఇలా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వెంటనే విషయం గుర్తించిన ఆస్పత్రి వర్గాలు ఆ ఉద్యోగిని పిలిచి మందలించడంతో ఆయన ఆ పోస్టును తొలగించాడు. 


శస్త్రచికిత్స చేసిన వైద్యురాలిని కాపాడేందుకు.. ఆస్పత్రి రికార్డుల్లో బాధితురాలి కేస్ షీట్, చిరునామా, ఫోన్ నెంబర్ వంటి సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి ఆవరణలోని ఎక్స్ రే విభాగంలో తీసిన రికార్డులపై మాత్రం బాధితురాలి పేరు, తేదీతో సహా పలు వివరాలు ఉన్నాయి. ఎక్స్ రేలో కత్తెర స్పష్టంగా కనిపిస్తుండడంతో వైద్యులు తీవ్రంగా కంగారు పడుతున్నారు.  మరోవైపు ఎక్స్ రే రూపేణా బయటకు పొక్కడంతో సదరు వైద్యురాలు ఓ ఉన్నతాధికారిని సంప్రదించారు. ఈ సమస్య నుంచి బయట పడేయాలని ప్రాధేయపడ్డారు. చాలా కాలం కలిసి పని చేసిన చొరవ కొద్దీ ఆయన ఈ వ్యవహారాన్ని ప్రతీ ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ సమస్యను సద్దుమణిగేలా చేస్తున్నారు. అయితే ఘటన జరిగి పది రోజులు కావస్తున్నా అలాంటిదేమీ తమ ఆస్పత్రిలో జరగలేదన్నట్లుగా పలువురు అధికారులు వ్యవహరిస్తుండడం గమనార్హం. ఇదే విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ శశిధర్ ను వివరణ కోరగా.. తాను సెలవులో ఉన్నానని... కత్తెర మరిచిన ఘటన తన దృష్టికి రాలేదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


తెలంగాణలోనూ ఇలాంటి ఘటనే 



ఓ మహిళా డాక్టర్ చేసిన పొరపాటు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు డెలివరీ చేసి ఆ డాక్టర్ పేషెంట్ కడుపులోనే కత్తెర మరిచిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఎన్నో ఏళ్ల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచిర్యాలకు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం ఆరు సంవత్సరాల కిందట గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వచ్చింది. ప్రసవ సమయంలో ఆ డాక్టర్ కత్తెరను కడుపులోనే మర్చిపోయింది. ఇన్నాళ్లూ ఈ ఘటన అస్సలు బయటికి రాలేదు.


ఇటీవల బాధితురాలైన మహిళకు కడుపు నొప్పి వచ్చింది. వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌కు వెళ్లి స్కానింగ్‌ చేయించుకోగా కడుపులో కత్తెర ఉన్న విషయం బయటికి వచ్చింది. దీంతో బాధితురాలు గోదావరిఖనికి వచ్చి తనకు డెలివరీ చేసిన డాక్టర్ ని నిలదీసింది. దీంతో ఇరువురూ మాట్లాడుకొని వివాదాన్ని పరిష్కరించుకున్నట్లు తెలిసింది. ఆపరేషన్ చేసి కడుపులో కత్తెరను తీసేందుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని మహిళా డాక్టర్ ఒప్పుకోవడంతో బాధిత కుటుంబ సభ్యులు శాంతించినట్లు సమాచారం.