Andhra Pradesh Assembly Elections 2024 : కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission Of India ) అధికారులు, సోమవారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajeev Kumar), ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే (Anoop Chandra Pande ), అరుణ్ గోయల్ (Arun Goel) విజయవాడ (Vijayawada)కు రానున్నారు. మంగళవారం రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించనున్నారు.


సీఎస్, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరగనుంది. 10వ తేదీన ఎన్నికల సన్నద్దతపై ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈవీఎం ఫస్ట్ లెవల్ చెక్‌, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఈసీ బృందం సమీక్ష జరపనుంది. అస్తవ్యస్తంగా ఉన్న ఓటర్ల జాబితాలు, ఓట్ల తొలగింపులు, గంపగుత్తగా ఓటర్ల నమోదు వ్యవహారాలపై ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 9న వెంకటగిరిలో రా.. కదలిరా బహిరంగ సభ జరగాల్సి ఉంది.  కేంద్ర ఎన్నికల సంఘం బృందం విజయవాడలో పర్యటిస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీ బృందానికి ఫిర్యాదు చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బహిరంగ సభ యథాతథంగా జరగనుంది. 


 బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు జారీ
రెండు మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారుల బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికలతో సంబంధమున్న అధికారులు సొంత జిల్లాలో ఉండకూడదని, దీర్ఘకాలంగా ఒకేచోట ఉన్నవారు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని ఆదేశాలు ఇచ్చింది. మూడేళ్లుగా ఒకే జిల్లాలో ఉన్న వారిని కొనసాగించవద్దని స్పష్టం చేసింది. 2024 జూన్ ఆఖరుకు మూడేళ్లు పూర్తయ్యేవారిని కొనసాగించొద్దని హెచ్చరించింది. బదిలీలు, పోస్టింగుల విషయంలో అలసత్వం వహించవద్దని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం  రాష్ట్రాల సీఈవోలు, సీఎస్‌లకు ఈ ఆదేశాలు జారీ చేసింది. 


జనవరి 31కి బదిలీలు పూర్తి చేయాల్సిందే
బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియను 2024 జనవరి నెలాఖరుకి పూర్తిచేసి, నివేదికను సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అదనపు డీజీపీ నుంచి ఎస్సై వరకూ పోలీసుశాఖలో బదిలీలు చేపట్టనున్నారు. అదనపు డీజీపీలు, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఆర్‌ఐలకు ఈ బదిలీలు వర్తించనున్నాయి. ఎక్సైజ్‌ శాఖలో ఎస్సై, అంతకంటే పై స్థాయి అధికారులకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఉప ఎన్నికల అధికారులు, ఆర్‌వోలు, జాయింట్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్‌కలెక్టర్లు, తహసీల్దార్లు అధికారులకు ఈ బదిలీల నిబంధన వర్తించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20నాటికి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఇరవై రోజుల ముందుగానే ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ కంటే... 20 రోజుల ముందే వచ్చే అవకాశం ఉందని అధికార, విపక్ష నేతలు చెబుతున్నారు. 2019 ఎన్నికల షెడ్యూల్‌ మార్చి 10వ తేదీన విడుదలైంది. ఈసారి ఫిబ్రవరి 20న విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 


Also Read: ప్రజాపాలన కోసం ప్రత్యేక వెబ్‌సైట్, సోమవారం ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి


Also Read: అంగన్వాడీల జీతాల పెంపు ఇప్పుడు సాధ్యం కాదు: మంత్రి బొత్స