కర్ణాటక, మహారాష్ట్రల కంటే మెరుగైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఫలితాలను సాధించటం అభినందనీయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలను అందించాలని చెప్పారు.
ఆదాయాన్ని సమకూర్చే శాఖలపై జగన్ సమీక్ష...
ఆదాయన్ని ఆర్జించే శాఖలతో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలన్న సీఎం, దీనివల్ల సమర్థత పెరుగుతుందని, పన్నులు చెల్లించే వారికి సౌలభ్యంగా సేవలు అందుతాయని అభిప్రాయపడ్డారు. మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వీటిని అధ్యయనం చేసి వచ్చే సమీక్షా సమావేశంలో తనకు నివేదించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర లక్ష్యాలను చేరుకున్నాం, ప్రస్తత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను గురించి ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ మెరుగైన పనితీరు కనబరిచిందని సీఎం తెలిపారు.


కర్ణాటక, మహారాష్ట్రల కంటే మెరుగైన స్థానంలో ఏపీ ఉందని, గత ఏడాదితో పోలిస్తే కర్ణాటకలో 27.51 శాతం, మహారాష్ట్రలో 24.4  శాతం, ఆంధ్రప్రదేశ్ లో 25.29 శాతం వృద్ధి సాదించినట్లు పేర్కొన్నారు. 2022-23లో రాష్ట్రంలో వాణిజ్యపన్నుల ఆదాయం రూ. 51,481 కోట్లు. 93.24 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టుఈ సందర్బంగా అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24) రూ.60,191 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు, లీకేజీలను అరికట్టి, సమగ్ర పర్యవేక్షణల ద్వారా లక్ష్యాన్ని చేరుకునే మార్గాల పై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.  


డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, శాఖలతో సమన్వయం, ఎగవేతల పట్ల అప్రమత్తత, సమర్థతను పెంచుకునే పద్ధతుల ద్వారా పని తీరును మెరుగుపరచాల్సిన అవసరం ఉందని  ముఖ్యంత్రి అభిప్రాయపడ్డారు. సరైన విధానాలను అమలు చేయడం ద్వారా సమర్థత గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు అందుతాయని, తద్వారా ఆదాయాలు పెరుగుతాయని జగన్ వ్యాఖ్యానించారు.
రిజిస్ట్రేషన్ల ఆదాయంలో వృద్ధి...
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం వృద్ధి చెందినట్టుగా తెలిపిన అధికారులు, గత ఐదేళ్లుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయానికి సంబందించిన వివరాలను వెల్లడించారు. 2018-19లో  ఆదాయం రూ.4725 కోట్లు కాగా, 2022-23 నాటికి రూ. 8071కోట్లకు ఆదాయం పెరిగిందని అన్నారు. రిజిస్ట్రేషన్లు, టౌన్ ప్లానింగ్‌ విభాగాలు, మండల కార్యాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలు సహా ఇతర చోట్ల కూడా ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని జగన్ అన్నారు.సేవలు అందించడంలో అత్యంత పారదర్శకత ఉండాలని సూచించారు.  ఎవరికి ఫిర్యాదు చేయాలన్న దానిపై ఏసీబీ నంబర్లను ఆయా కార్యాలయాల్లో ప్రముఖంగా కనిపించేలా హోర్డింగ్స్ ఉంచాలని సీఎం జగన్ సూచించారు.
సాంకేతికతకు ప్రాధాన్యత...
మానవ ప్రమేయాన్ని తగ్గించి పారదర్శకతను పెంచే సాంకేతిక విధానాలపై అధ్యయనం చేసి వాటిని అమల్లోకి తీసుకురావడంపై దృష్టిపెట్టాలని జగన్ సూచించారు. వచ్చే సమీక్షా సమావేశం నాటికి మంచి మార్పులు కనిపించాలని అధికారుతో సీఎం అన్నారు. అవినీతి నిరోధకశాఖను క్రియాశీలకంగా ఉంచాలని సీఎం ఆదేశాలిచ్చారు.
తగ్గిన బీరు, లిక్కర్‌ వినియోగం:
2018-19 తో పోలిస్తే  2022-23లో 12.61శాతం లిక్కర్‌ వినియోగం తగ్గినట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదికను అందించారు. 2018-19లో 384.3 లక్షల కేసుల లిక్కర్ ను రాష్ట్రంలో వినియోగిస్తే.. 2022-23లో 335.9 లక్షల కేసుల లిక్కర్‌ వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. 2018-19లో 277.1 లక్షల కేసుల బీరును వినియోగిస్తే.., 2022-23లో 116.7 లక్షల కేసులు బీరు మాత్రమే వినియోగించినట్టు రికార్డులు నమోదయ్యాయి,
 2018-19తో పోలిస్తే 2022-23లో 57.87శాతం తక్కువగా బీరు వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు.