AP CM Chandra Babu: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉండగానే కీలక విషయాలపై క్లారిటీ వచ్చింది. మరోవైపు రైల్వే జోన్ విషయంలో కూడా మరో ముందడుగు పడింది. రైల్వేజోన్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖలో ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ప్రధానమంత్రిని కలిసి సీఎం చంద్రబాబు ఆయన్ని ఆహ్వానించారు. తర్వాత రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో కూడా సమావేశమై దీని చర్చించారు. 


ప్రధానితో చంద్రబాబు కీలక సమావేశం


రైల్వేజోన్‌తోపాటు పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలపై కూడా కేంద్రం ఓ స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. వీటిపై మరింత క్లారిటీ కోసం ఇవాళ కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉంటూ కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. ఇవాళ అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ అవుతారు. సోమవారం సుమారు గంటన్నరపాటు మోదీతో చంద్రబాబు సమావేసమయ్యారు. ఈ భేటీలోనే అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు, పోలవరానికి కేంద్ర సాయం, రైల్వేజోన్‌ శంకుస్థాపన, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారాలన్నింటిపై చర్చించారు. 


విజన్ 2047కు సాయం చేయాలని సూచన 


కేంద్ర ప్రభుత్వ వికసిత భారత్‌- 2047 విజన్‌ సాకారం చేసేందుకు ఏపీ కూడా అదే విజన్‌తో వెళ్తోందని ప్రధానికి చంద్రబాబు వివరించారు. ఆంధ్రా-2047 విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా దీన్ని రూపొందిస్తామన్నారు. దీని కోసం కేంద్రం నుంచి సహకారం అవసరమని ప్రధానికి తెలియజేశారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, చేపట్టిన పనులను ప్రధానికి తెలియజేశారు. ఏపీకి సాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని సీఎంఓ ఆఫీస్‌ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. 


అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం - అమరావతికి ప్రత్యేక రైల్వేలైన్‌కు వినతి 


ప్రధానితో సమావేశం అనంతరం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం  సమావేశమయ్యారు. పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులు, ఐటీ, సెమీకండక్టర్‌ పరిశ్రమలు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఏర్పాటుపై మాట్లాడారు. ఏపీలో స్టార్టప్‌లను సపోర్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. వాల్తేర్‌ డివిజన్‌ను అలానే ఉంచాలని విశాఖపట్నం- అమరావతి మధ్య కొత్త రైల్వేలైన్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైను అమరావతికి అనుసంధానిస్తూ హైస్పీడ్‌ రైల్వే కారిడార్లు ఏర్పాటుకు సూచనలు చేశారు. 


పోలవరం ప్రాజెక్టు కోసం 2800 కోట్లు విడుల చేసిన కేంద్రం 


ఢిల్లీలో చంద్రబాబు టూర్ కొనసాగుతున్న టైంలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.2,800 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. పాత బిల్లుల బకాయిలు రూ.800 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,000 కోట్లు మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటి నుంచి మొదట రాష్ట్రప్రభుత్వం ఖర్చుతో పనులు చేయడం తర్వాత కేంద్రం ఆ నిధులు విడుదల చేయడం జరుగుతోంది. 


నేడూ కీలక భేటీలు


ఇవాళ చంద్రబాబు కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్, పీయూష్‌ గోయల్, నితిన్‌ గడ్కరీ, హర్‌దీప్‌సింగ్‌ పూరీలతో సమావేశం కానున్నారు. రాత్రి 8 గంటలకు అమిత్‌షాను కలవనున్నారు. అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ధి, వరద సాయం, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఇష్యూపై మంత్రులతో చర్చించనున్నారు. 


Also Read: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 30 జిల్లాలంటూ ప్రచారం - ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత ఇదే