ఇవాళ దివంగత మహానేత వైస్‌ రాజశేఖర్‌రెడ్డి 14వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. తండ్రితో ఉన్న అనుబంధాన్ని, ప్రజలకు ఆయన సేవలను మరోసారి గుర్తుచేసుకున్నారు. నాన్నామీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది అంటూ భావొద్వేగంతో ట్వీట్‌ చేశారు. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్‌ వైఎస్ వైఎస్‌ రాజశేఖర్‌రెట్టి అన్నారు. ఆయన పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలే.. తనకు కొండంత అండగా నిలిచాయని చెప్పారు. తండ్రి ఆశయాలే తనను నడిపిస్తున్నాయన్నారు. సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆయన చేయిపట్టి నడిపిస్తున్నారని చెప్పారు. వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను నాన్న అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 






వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వైఎస్‌ కుటుంబ సభ్యులతో పాటు వైఎస్‌ఆర్‌ అభిమానులు ఇడుపుపాలయ తరలివెళ్తున్నారు. వైఎస్‌ఆర్‌కు నివాళులు అర్పించేందుకు వచ్చిన వారితో ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ ప్రాంగణం కిక్కిరిసింది. 


ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల, ఆమె తల్లి విజయమ్మ నివాళి అర్పించారు. మహానేత మన నుంచి వెళ్లిపోయి 14 ఏళ్లు పూర్తయినా ప్రజల గుండెల్లో ఆయన ఇంకా నిలిచే ఉన్నారని చెప్పారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయారని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిదే అని చెప్పారు.


సీఎం జగన్‌ ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ నివాళులు అర్పించిన తర్వాత.. పులివెందులలో పలు అభివృద్ధి కార్యాక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ రేపు లండన్ పర్యటనకు వెళ్తుండటంతో అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఇడుపులపాయ నుంచి నేరుగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్తారు సీఎం జగన్‌. అక్కడి నుంచి లండన్‌ పర్యటనకు బయల్దేరుతారు.