టీడీపీ అధినేత చంద్రబాబు ఓ స్కిల్డ్ నేరస్థుడని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఆయన చేయని అరాచకాలు లేవని అన్నారు. విద్యార్థి దశలోనే నీచ రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. డబ్బులుంటేనే రాజకీయాలు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని, హైదరాబాద్‌ అభివృద్ది పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. అమరావతి, పోలవరం సహా ఆయన చేసిన ప్రతి పనిలో కుంభకోణమేనని విమర్శించారు. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ నేతల సమీక్ష సమావేశంలో విజయసాయి రెడ్డి మాట్లాడారు.


స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో డొల్ల కంపెనీల ద్వారా బినామీ అకౌంట్లలోకి ప్రభుత్వ నిధులు మళ్లించారని ఆరోపించారు. రూ.3 వేల కోట్లలో రూ.2700 కోట్లు ఇస్తామని సీమెన్స్‌ ఎప్పుడూ చెప్పలేదని, ఈస్కాంలో సుమారు రూ.470 కోట్లు కొట్టేశారని ఆరోపించారు. చంద్రబాబే కుంభకోణానికి పాల్పడ్డాడని ఐటీశాఖ కూడా చెప్పిందని విజయసాయి రెడ్డి అన్నారు. 


చంద్రబాబు ఒకవేళ నిజాయతీపరుడైతే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో విచారణ ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాబోదని, వైఎస్‌ జగనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా సీఎం జగన్‌ పని చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు స్కామ్‌లో రామోజీరావు పాత్రపై కూడా విచారణ జరగాలని విజయసాయి రెడ్డి అన్నారు. బీజేపీలో టీడీపీ కోవర్ట్ పురంధేశ్వరీ ఉన్నారని అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.


ప్రస్తుతం టీడీపీ నేతల మాటలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంతగా నేర స్వభావం కలిగిన వ్యక్తి అని వైఎస్సార్‌ సీపీ విమర్శించారు. బాబు నీతిమంతుడని ఎవరూ అనుకోవడం లేదని, అన్ని కేసుల్లో ఆయన స్టేలు తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. టీడీపీ బంద్‌కు పిలుపు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా అసలు స్పందనే లేదని అన్నారు. బంద్‌ రోజు కనీసం హెరిటేజ్‌ దుకాణాలు కూడా మూయలేదని చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ప్రతీదీ స్కామేనని ఎంపీ విజయసాయి అన్నారు. రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టించింది చంద్రబాబేనని విజయసాయి రెడ్డి విమర్శించారు. బాబుకు ప్రజాభిమానం లేదని, అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేసేవారని తెలిపారు.