Tirumala News: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నిరంతరం సేవలు చేయడానికి ఎంతో మంది ఉద్యోగులు కృషి చేస్తారు. పరిపాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను నియమిస్తుంది. అలా విధులు నిర్వహించిన ఓ అధికారి మాత్రం కనిపించడం లేదు. తిరుమల లడ్డూపై ఇంత వివాదం నడుస్తూన్నా ఇప్పటి వరకు స్పందించలేదు. ఐదేళ్లు అంతా తానై నడిపించిన ఆయన ఎక్కడ వెళ్లారో తెలియడం లేదు. 


తిరుమల అనగానే తిరుమల శ్రీవారు తరువాత స్వామి వారి లడ్డూ గుర్తుకు వస్తుంది. అలాంటి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని, అపచారం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తరువాత ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఎంతో ఆవేదన చెందారు. అది పూర్తిగా గత పాలకుల తప్పుగా కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుండగా.. కావాలనే కూటమి నాయకులు తమ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ వాదన.. అయితే ఇది పార్టీల కాదు గత ప్రభుత్వంలో టీటీడీని నడిపించిన ఆయనదే అంటున్నారు మరి కొందరు.


ధర్మారెడ్డి ఎక్కడ..?
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎవరైనా ఒక్కసారి అయిన తిరుమలలో పని చేయాలని ఆశ పాడుతారు. టీటీడీ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో పనిచేస్తే దేశంలో ఎక్కడ అయిన పని చేసే అవకాశం ఉంటుందనేది కూడా వాస్తవం. అలాంటి సంస్థకు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఐఆర్ఎస్ అధికారిని నియమించారు.


ప్రభుత్వం ఏర్పాడిన వెంటనే ఏవి ధర్మారెడ్డి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి ఏపీకి డిప్యూటేషన్‌పై వచ్చారు. అక్కడ నంచి తిరుమల జేఈవోగా పదవి కల్పించారు. ఆ తరువాత అదనపు ఈవో తిరుమలకు జీవో విడుదల చేశారు. దీనిపై అప్పట్లో బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ ధర్మారెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఇన్చార్జి ఈవోగా పదవి కేటాయించింది. ఐదేళ్ల కాలంలో తిరుమల జేఈవోగా... అదనపు ఈవోగా.. ఈవోగా... అప్పుడప్పుడు ఎస్వీబీసీ ఛైర్మన్‌గా...  ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీగా ఇలా ఏదైన ధర్మారెడ్డి అనేలా పరిపాలన సాగింది. తాజాగా జరిగిన లడ్డూలు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు, ఇతర పదార్థాల టెండర్ వేయడం.. ఆమోదం పొందడం కూడా ధర్మారెడ్డి ఉండగానే సాగింది. ఇప్పుడు ఇంత వివాదం నడుస్తున్నా ధర్మారెడ్డి మాత్రం బయటకు రావడం లేదు. దీనిపై స్పందించడం లేదు. 



నెయ్యి సిండికేట్ జరిగిందా..? 
తిరుమలకు నెయ్యి సరఫరా చేయడం అంటే సాధారణ విషయం కాదు. పెద్ద పెద్ద ఉత్పత్తి చేసే సంస్థలు టీటీడీ వరకు రావు. అయితే తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ టెండర్ వేసి అతి తక్కువకు కోడ్ చేసి టెండర్ దక్కించుకోవడం ఒక ఎత్తు అయితే దానికి సంబంధించి లోడ్ పంపడం కూడా వెంట వెంటనే జరిగింది.  


అయితే 800 కిలో మీటర్లు దూరం ఉన్న డైరీకి 4 రోజుల వ్యవధిలో రెండు ట్యాంకులు సరఫరా చేయడం.. అందులో కూడా ట్యాంకుల పేర్లు వేరేగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదంతా సిండికేట్ పనిగా అనుమానిస్తున్నారు. నెయ్యిలో సిండికేట్ కావాలనే పదార్థాలు కలిపారు అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేయడంతో పాటు సిట్ విచారణలో మరిన్ని వివరాల బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మాజీ ఈవో ధర్మారెడ్డి చుట్టూ జరిగిన వివాదంగా... ఆయనను ఇందులో ప్రధాన సూత్రధారిగా కూడా చేర్చే ప్రయత్నమంటున్నారు వైసీపీ నాయకులు.


Also read: వైఎస్ జగన్ తిరుమల పర్యటనకు డిక్లరేషన్ అడ్డంకి - హెచ్చరికలు చేస్తున్న బీజేపీ నేతలు - ఏం జరగనుంది ?