TTD News: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా శుక్ర‌వారం రాత్రి జ‌రుగ‌నున్న గరుడ వాహన సేవను ద‌ర్శించేందుకు తెల్లవారుజాము నుంచే భ‌క్తులు గ్యాలరీల్లో వేచి ఉన్నారని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. గరుడ వాహన సేవ సందర్భంగా టీటీడీ ఆలయ ఈవో ధర్మారెడ్డి, అధికారులతో కలిసి నాలుగు మాఢ వీధుల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ భూమన.. టీటీడీ సీనియర్ అధికారులను, శ్రీవారి సేవకులను అభినందించారు. భ‌క్తులకు అందజేస్తున్న అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మ‌రుగు దొడ్లు ఇతర సౌకర్యాలపై భక్తులతో ముచ్చటించారు. టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.


గరుడ వాహన సేవ సందర్భంగా ఉద‌యానిక‌ల్లా గ్యాల‌రీలు భ‌క్తుల‌తో నిండిపోయాయి. ఉదయం 5 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభం అయింది. తూర్పు-పశ్చిమ-ఉత్తరం-దక్షిణ మాడ వీధుల్లో గ‌ల 200కు పైగా గ్యాలరీల్లో దాదాపు 2 లక్షల మంది భక్తులు కూర్చునే అవ‌కాశ‌ం ఉంది. భ‌క్తుల కోసం ఉదయం 5 నుండి 6 గంటల మధ్య పాలు, కాఫీ,  ఉదయం 6.30 నుండి 8 గంటల మధ్య ఉప్మా, పొంగ‌ళి పంపిణీ చేశారు. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.


ఉదయం 10 గంటలకు సాంబార్ అన్నం, టమాటా అన్నం, స్వీట్ పొంగల్ అందించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి దాదాపు 3 గంటల వరకు భక్తులకు రెండు లక్షలకు పైగా పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. సాయంత్రం సుండ‌ల్‌, కాఫీ, పాలు మళ్లీ అందజేశారు. సాయంత్రం 7 గంటలకు గరుడ వాహనం ప్రారంభం కానుండ‌గా ఉత్తర, తూర్పు మాడ వీధుల్లో సాయంత్రం 6 గంటల వరకు వెజిటబుల్ కిచిడీ పంపిణీ చేశారని ఆలయ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వివరించారు. 


గరుడ వాహన సేవ ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్ ఏం చెప్పారంటే?


గరుడ సేవను చూడటానికి తిరుమల నాలుగు మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలసి శుక్రవారం సాయంత్రం పరిశీలించినట్టు తెలిపారు. గ్యాలరీలలో వేచి ఉండే ప్రతి భక్తుడికీ గరుడ వాహనంపై ఉన్న శ్రీ మలయప్ప స్వామి వారి దర్శనం చేయించిన తరువాతే స్వామి వారు ఆలయానికి వేంచేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే గ్యాలరీల్లో లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు లాంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. తాను చాలా మందితో మాట్లాడానని, అందరూ టీటీడీ ఏర్పాట్లపై సంతృప్తి, సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు.


భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలుగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు. నాలుగు మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు తెల్లవారు జాము నుంచి అంకిత భావంతో, భక్తి శ్రద్ధలతో సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకుల నిస్వార్థ‌ సేవలను టీటీడీ ఛైర్మన్, ఈవో కొనియాడారు. దాదాపు 1500 మంది శ్రీవారి సేవకులు ఆహార పొట్లాల‌ ప్యాకింగ్, గ్యాలరీలలో అన్న‌ప్ర‌సాదాల విత‌ర‌ణ‌, ఆరోగ్య శాఖ ఆధ్వ‌ర్యంలో తాగునీటి పంపిణీ త‌దిత‌ర సేవలందించారన్నారు.