Tirumala News Updates- తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు వెంకన్న సన్నిధికి వస్తుంటారు. వివిధ రవాణా మార్గాల ద్వారా తిరుపతికి చేరుకున్న భక్తులు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు ట్యాక్సీలను ఆశ్రయిస్తుంటారు. తిరుమల, తిరుపతి లో ట్యాక్సీలు తిరగాలంటే చెలానాలు కట్టక తప్పదని వాహన యజమానులు, డ్రైవర్లు అంటున్నారు. ఉన్నతాధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఓ పోలీస్ ట్యాక్సీ డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కట్టాల్సిన డబ్బులు పెంచుతానని చెబుతున్న వీడియో స్థానికంగా వైరల్ అవుతోంది.


తిరుమలకు వచ్చే భక్తులు తమకు తోచిన విధంగా బడ్జెట్ ప్లాన్ చేసుకుని యాత్ర కొనసాగిస్తారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ దిగడం మొదలు ఖర్చు మొదలవుతుంది. కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు అలిపిరి లేదా శ్రీవారి మెట్టు చేరుకోవాలంటే ఆటో, ట్యాక్సీలు అధికంగా వసూలు చేస్తున్నారని భక్తులు చెబుతున్నారు. బస్టాండు, రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి కి షేర్ ఆటోలు ఉంటాయి. రూ.20 ఒక్కరికి చెల్లించి ప్రయాణం చేయవచ్చు. సింగల్ ఆటో తీసుకుంటే రూ.100 చెల్లించవచ్చు కాని ఆటో వాళ్లు అంతకు మించి వసూలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. ఇక శ్రీవారి మెట్టు కు అయితే టీటీడీ ఉచిత ఒస్సులు ఉన్నాయి. ఇవి కాకుండా బస్టాండ్ నుంచి శ్రీనివాసమంగాపురం వరకు బస్సులు అక్కడి నుంచి రూ.30 చెల్లించి ఆటో ద్వారా శ్రీవారి మెట్టు కు వెళ్లొచ్చు. కానీ తిరుపతి నుంచి రూ.300 పైగా వాహనదారులు వసూలు చేస్తున్నారు. తాము సైతం అధికారులకు కమిషన్ చెల్లించుకోవాల్సి ఉందని, అందుకే ఎక్కువ మొత్తం తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది.


తిరుమల - తిరుపతి మధ్య ఆర్టీసీ బస్సులు
తిరుమల తిరుపతి మధ్య రెగ్యూలర్ గా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. భక్తులు ఆర్టీసీ బస్సుల కంటే ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం చేయవచ్చు, తిరుమలలో తాము వెళ్ళే ప్రాంతానికి నేరుగా చేరుకోవచ్చని ఆలోచనతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రైవేటు ట్యాక్సీ నడిపేవారు వెంకన్న దర్శనానికి వచ్చే వారి వద్ద నుంచి ఇష్టానుసారం వసూలు చేస్తున్నారని కొందరు వాపోయారు. ఒక భక్తుడికి రూ.200 పైగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక రద్దీ ఎక్కువగా ఉంటే మాత్రం ఆ ధర ఎంత పెంచినా ఆశ్చర్యం లేదు.


స్ధానిక ఆలయాల సందర్శన 
తిరుమలకు వచ్చే యాత్రికుల తిరుమలలోని స్ధానిక ప్రదేశాలను సందర్శించడానికి ఆసక్తి చూపిస్తారు. ఇదే అదునుగా చేసుకుని ట్యాక్సీవాలాలు, ఆటోవాలాలు సామార్థ్యాన్ని మించి  ఎక్కించుకుని వెళ్తుంటారు. ఆయా మార్గాలలో ఉండే కొందరు సెక్యూరిటీ సిబ్బందికి ఎంతో కొంత నగదు ఇచ్చి వెళ్ళిపోతుంటారు. ఆ ప్రాంతాలకు ఆర్టీసీ అప్ అండ్ డౌన్ టికెట్ సౌకర్యం కల్పిస్తున్న విషయం భక్తులకు తెలియనీయకుండా ప్రైవేట్ ట్యాక్సీల వారు ప్యాకేజీలు పేరుతో సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు.


తిరుమల, తిరుపతి మధ్య సుమారు 1000 పైగా ప్రైవేట్ వాహనాలు ఉంటాయి. ట్యాక్సీ స్టాండ్ల నుంచి పోలీసులు కమిషన్లు తీసుకుంటారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. పోలీసులకు కమీషన్లకు పాటు వారు అడిగినప్పుడు పికప్ లు డ్రాప్ లు చేయకపోతే వారికి చెలానాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు చెప్పిన పనులు చేయకుండా తిరిగి ప్రశ్నిస్తే ఏ తప్ప లేకపోయిన ఏదో ఒక కారణంతో చలానాలు వేస్తున్నారని ఆరోపణలున్నాయి. లేకపోతే రెండు ఘాట్ రోడ్డుల్లో నిర్ణయించిన సమయం కంటే త్వరగా వచ్చారని ఘాట్ రోడ్డులో వాహనాలను అనుమతించరని చెబుతున్నారు.


వేసవిలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న తరుణంలో అయిన టీటీడీ, పోలీసులు తిరుమల - తిరుపతి, స్థానికాలయాలు, తిరుపతిలో సైతం ధరలను నియంత్రించీ వాటిని అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ట్యాక్సీవాలాలు కోరుతున్నారు. నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.