Tirupati News: ఏడాది వయసు ఉన్న పాపకు గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి తిరుపతిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ హాస్పిటల్ పునర్జన్మను ప్రసాదించింది. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన 13 నెలల పాప అనారోగ్యం బారిన పడగా.. ఆమె తల్లిదండ్రులు విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాప గుండె పనితీరు సరిగ్గా లేది.. గుండె మార్పిడి చేస్తేనే ఆమె బతుకుతుందని చెప్పారు. అలాగే తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. మూడు నెలల క్రితం తల్లిదండ్రులు ఆ పాపను హృదయాలయంలో చేర్చగా.. పాపకు సరిపోయే గుండె కోసం వైద్యులు జీవన్ దాన్ లో రిజిస్టర్ చేశారు. అప్పటి నుంచి ఆస్పత్రికి తీసుకుని వచ్చి అడ్మిట్ చేశారు. ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనాథ రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు ఆ చిన్నారికి వైద్యం చేస్తూ వచ్చారు. 


అయితే చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో రెండేళ్ల బాలుడికి బ్రెయిన్ డెడ్ అయినట్లు సమాచారం అందడంతో ఏపీ జీవన్ దాన్ సంస్థ, చిన్న పిల్లల గుండె చికిత్సల నిపుణులు డాక్టర్ గణపతి బృందాన్ని డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి సమన్వయం చేశారు. టీటీడీ సహకారంతో అంబులెన్స్, మరో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకొని వైద్య బృందం ఆదివారం రాత్రికే చెన్నై చేరుకుంది. గ్రీన్ చానల్ అవసరం లేకుండా 2 గంటల 15 నిమిషాల్లోనే గుండెను తిరుపతిలోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు గుండె చేరుకోవడంతో.. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గణపతి నేతృత్వంలోని బృందం గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. అయితే 30 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఈ చికిత్సను టీటీడీ ప్రాణదానం, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా ఉచితంగా చేశారు. 


నెల రోజుల క్రితమే 15 ఏళ్ల బాలుడికి చికిత్స..


తిరుపతిలోని పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ హాస్పిటల్ లో వైద్యులు జనవరి 22వ తేదీన 15 సంవత్సరాల బాలుడికి విజయవంతంగా గుండె మార్పిడి చికిత్స చేశారు. విశాఖపట్నంలో దాత నుంచి సేకరించిన గుండె తిరుపతిలోని పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి అమర్చారు. విశాఖపట్నానికి చెందిన బీహెచ్ఈఎల్ ఉద్యోగి అయిన ఆనందరావు తన భార్య జంజూరు సన్యాసమ్మ (48) తో కలిసి సంక్రాంతి పండగకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్ పై ఉన్న సన్యాసమ్మ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో సన్యాసమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆనందరావు, సన్యాసమ్మను స్థానిక ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్రమంలోనే సన్యాసమ్మ బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఈ నెల 16వ తేదీ నుంచి బ్రెయిన్ డెడ్ అయిన సన్యాసమ్మకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 


జీవన్ దాన్ సభ్యులు ఆ కుటుంబసభ్యుల దగ్గరకు వెళ్లి అవయవదానం గురించి అవగాహన కల్పించారు. అవయవ దానం చేస్తే చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న కొందరినైనా బతికించవచ్చని వారికి వివరించడంతో ఆ కుటుంబసభ్యులు అవయవదానానికి ఒప్పుకున్నారు. సన్యాసమ్మ గుండెను అన్నమయ్య జిల్లా కేఎస్ అగ్రహారానికి చెందిన విశ్వేశ్వర్ అనే 15 ఏళ్ల బాలుడికి ఇచ్చేందుకు సన్యాసమ్మ కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. ఇలా బాలుడి ప్రాణాన్ని నిలబెట్టారు.