అరాచక పాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే విధంగా ప్రజలు మనుగోడులో తీర్పు ఇస్తారని మనుగోడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.. ఇవాళ ఉదయం తిరుమల స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం బయటకు వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు శ్రీవారి ఆశీస్సులు పొందటం సంతోషంగా ఉందని అన్నారు. ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. ఓ కుటుంబం చేతిలోకి వెళ్లడంతో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అవుతుందని ఆరోపించారు. 


తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని రెండు సార్లు అధికారం చేపట్టారని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారని, అడుగడుగునా ఉద్యమ కారులను అవమానిస్తునే ఉన్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగజార్చారని ఆయన చెప్పారు. అరాచక పాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే విధంగా ప్రజలు మునుగోడులో తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్క వ్యక్తి కోసం వచ్చిన ఎన్నికలు కావని, తెలంగాణ భవిషత్తు కోసం వచ్చిన ఎన్నికలని, ప్రలోభాలకు గురి చేసి ప్రతిపక్షాన్ని కొనుగోలు చేసి ప్రతిపక్షం లేకుండా సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రికి బుద్ది చెప్పేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని, కుటుంబ రాక్షస పాలనా నుంచి తెలంగాణను కాపాడాలని ఆయన కోరారు. మునుగోడు ప్రజల తీర్పు శిరసావహిస్తానని, తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం తథ్యం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


నియోజకవర్గంలోనే గడుపుతున్న కోమటిరెడ్డి
ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో గ్రామగ్రామాన పర్యటిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను మారుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ గెలిచేది లేదని స్పష్టం చేశారు.


మునుగోడు ఉపఎన్నిక జరిగిన నెలలోపే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. మునుగోడులో కేసీఆర్ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.


తాను డబ్బులకు, కాంట్రాక్టులకు అమ్ముడు పోయి బీజేపీలో చేరానని చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. డబ్బులకు అమ్ముడు పోయే వ్యక్తిని అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వాడిని కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ ప్రజలు, కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని అన్నారు. మునుగోడు ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువని, ఆకలినైనా తట్టుకుంటారు కానీ ఓట్లను అమ్ముకోరని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న మాట్లాడారు.