తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తుల రద్దీ తగ్గినా, శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం లభించింది. శుక్రవారం 19-08-2022వ తేదీన స్వామి వారిని 64,438 మంది దర్శించుకున్నారు. ఇక 34,361 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 4.53 కోట్లు రూపాయలు భక్తులు హుండీ ద్వారా స్వామి వారికి కానుకలు సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 లోని అన్ని కంపార్ట్మెంట్లు సర్వదర్శనం భక్తులతో నిండి పోయింది. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు ఇరవై గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. శ్రీనివాసుడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరమైన రోజుగా చెబుతూ ఉంటారు. శ్రీనివాసుడు ఏడుకొండల్లో కొలువైన రోజుగా, మహాలక్ష్మీ దేవిని వక్షస్ధలంలో నింపుకున్న రోజుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే శనివారం రోజున స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమల యాత్రకు వస్తుంటారు.
ఈ 21 వరకు సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న క్రమంలో భక్తులు ఓపికగా వేచి‌ ఉండి స్వామి వారి దర్శనం పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తొంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 21 వరకూ సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. ఆగస్టు 22 నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు మళ్లీ మొదలవుతాయి. శ్రీనివాసుడి దర్శనం కోసం తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు అలిపిరి‌ నడక మార్గం, శ్రీవారి నడక మార్గం, తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి తిరుమల పుణ్యక్షేత్రంకు చేరుకోవచ్చు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులు ముందుగా సిఆర్వో కార్యాలయం వద్ద వసతి గదులు పొంది, స్వామి వారికి తలనీలాలు సమర్పించి స్వామి వారి దర్శన భాగ్యం పొందే అవకాశం కల్పిస్తోంది టీటీడీ. ఇక యాత్రికుల సౌఖర్యార్ధం తిరుమలలో ప్రధాన ప్రాంతాల్లో పుడ్ కౌంటర్లతో పాటుగా, మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది టీటీడీ. అదే విధంగా భక్తులకు కోరినన్ని లడ్డూలను భక్తులకు టీటీడీ అందిస్తోంది. ఇక తిరుమల యాత్రతో పాటుగా వివిధ యాత్ర ప్రదేశాలు భక్తులు సందర్శించేందుకు బస్సు సౌఖర్యం కల్పించింది టీటీడీ. 
శనివారం రోజు ఎన్నో విశేషాలు..
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శ్రీనివాసుడు వేంకటాద్రికి తరలివచ్చిన రోజు, శ్రీమహాలక్ష్మిని వక్షస్థలాన నిలిపిన రోజు శనివారమే. అందుకే స్వామికి శనివారమంటే ప్రీతిగా పురాణాలు చెబుతున్నాయి. అంతే కాకుండా పద్మావతీ శ్రీనివాసుల కల్యాణం జరిగిన రోజు, స్వామి వారిని ఏడుకొండలపై మొదటగా భక్తులు కనుగొన్న రోజు కనుక శనివారానికి స్థిరవారమని పేరు ఉంది. శనివారాన్నే మందవారమని కూడా పిలుస్తుంటారు భక్తులు. ఓంకారం ప్రభవించిన రోజు, సర్వజనుల శనిపీడలు తొలగింపబడే రోజుగా, ఆ రోజున ఎవరైతే నిన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి జోలికి రానని శనీశ్వరుడు స్వామి వారికి వాగ్దానం చేసిన రోజుగా పురాణాలు చెబుతున్నాయి. శనివారం శ్రీనివాసునికి వ్రతం జరిపించి, ప్రత్యేక పూజలు చేస్తే స్వామి ప్రసన్నుడై అనుగ్రహిస్తారని పురాణాల్లో, ఇతిహాసాల్లో ‌ఉంది. 
శ్రీవారికి కైకర్యపరుల హారతి
ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు అర్చకులు. ముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుపుతారు అర్చకులు. దీనినే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు.
గొల్ల హారతి సమర్పణ.. విశ్వరూప దర్శనం
శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దిన తరువాత గొల్ల హారతి సమర్పణ జరుగుతుంది. తర్వాత వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మ తీర్థాన్ని తాము స్వీకరించిన తరువాత జియ్యంగార్లలకు, సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థంను అందిస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి, తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు. ఈ సమయంలో జరిగే దర్శనానికి విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు. అనంతరం భోగ శ్రీనివాసమూర్తి వారికి స్నాన పీఠంపై వేయించేపు చేసిన అర్చకులు. తోమాల సేవ ప్రారంభిస్తారు. ముందుగా ఆకాశగంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత శ్రీవారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు యధా క్రమం తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం పరదా వేసి ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు. 


శ్రీవారి మూలవిరాట్ కు ఆసనం, పాద్యం, అర్ఘ్యం, అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది. అటుతరువాత వక్షఃస్ధల లక్ష్మీ, పద్మావతి తాయార్లకు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి, శ్రీ కొలువు శ్రీనివాసమూర్తికి, సీతా, లక్ష్మణ, రాములవారికి, రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి వారికి సాలగ్రామ, శఠారిలకు శ్రీ సుదర్శనల వారికి విమాన వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు. ఈ తంతుతో తోమాల సేవ పూర్తి అవుతుంది. అటు తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు. 


శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేసి, సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలోని 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన నిర్వహిస్తారు. అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు. అటు తరువాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది. స్వామి వారి ప్రాతఃకాల నైవేధ్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు. అటు తర్వాత సన్నిధిలో శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహించిన తరువాత సర్కారు వారి హారతి జరిపి విఐపి బ్రేక్‌ దర్శనంకు భక్తులను అనుమతిస్తారు. అటు తర్వాత శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు. శ్రీవారి ఉత్సవమూర్తి అయినా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రారకారంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు అభిజీలగ్నంలో శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపరంగా నిర్వహిస్తారు.
శాస్త్రోక్తంగా డోలోత్సవం సేవ
శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను శాస్త్రోక్తంగా నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ వారికి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంత్రం కొలువు మంటపంలో సహస్త్ర దీపాల కాంతులతో శ్రీవారికి ఒంజల్ సేవను నిర్వహిస్తారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత తిరుమాఢ వీధిలో నిత్యోత్సవానికి నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారిని సన్నిధిలోనికి వేంచేపు చేస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు అర్చకులు. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలో అలంకరించిన పుష్పమాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల,రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహించి సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవ నిర్వహిస్తారు అర్చకులు.