Tirumala News: శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. హిందూ జనశక్తి సంస్థకు చెందిన లలిత్ కుమార్, శ్రీ ఆదిభట్ల కళాపీఠం అధ్యక్షురాలు కరాటే కళ్యాణి టీటీడీపై చేసినవి అవాస్తవ ఆరోపణలుగా కొట్టిపారేసింది. తమ ఉనికి చాటుకోవడానికి ఇలాంటి వారు నానా యాగీ చేస్తారని, అలాంటి వారి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. 


శిల్ప సంపదకు ఇబ్బంది కల్గించే ఆస్కారమే లేదు..!


బంగారు తాపడం పనులు జరుగుతున్న పాత హుజూర్ ఆఫీసు ప్రాంగణంలో 24 గంటలూ సిసి కెమెరాల నిఘా ఉంటుందని పేర్కొంది. సంబంధిత సిబ్బంది లోపలికి వెళ్లాలన్నా.. రిజిస్టర్ లో పేరు నమోదు చేసి, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసేసే వెళ్లాలని పేర్కొంది. ఇది నిషిద్ధ ప్రాంతంగా తెలిపింది. స్ట్రాంగ్ రూమ్, పని జరిగే ప్రాంతంలో పూర్తి స్థాయిలో అధికారుల నిఘా, విజిలెన్స్ బందోబస్తు కూడా ఉంటుందని తెలిపింది. ఇంతటి పటిష్టమైన ప్రాంతం నుండి 50 కిలోల బంగారం పక్కదారి పట్టించారని ఆరోపించడం వారి అజ్ఞానానికి, ప్రచార యావకు నిదర్శనమని టీటీడీ పేర్కొంది. ఆలయ శిల్ప సంప్రదాయం ప్రకారం, జీయర్ స్వాములు, అర్చకుల సలహాలు తీసుకుంటూ స్థపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులు జరుగుతున్నట్లు పేర్కొంది టీటీడీ. ఇక్కడ శిల్ప సంపదకు ఇబ్బంది కలిగించే ఆస్కారమే లేదని, ఈ విషయం తెలుసుకోకుండా సదరు వ్యక్తులు అవగాహనారాహిత్యంతో ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికింది. 


"ఏప్రిల్ 17వ తేదీ సోమవారం రోజున ఆరోపించిన విధంగా గోవిందరాజ స్వామి బంగారం తాపడం పనులు, శిల్ప సంపద నాశనం చేయడం, ముస్లిం వర్కర్లు పని చేస్తుండడం అన్నది అవాస్తవం.. అవాస్తవం, అవాస్తవం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి గోవింద రాజు స్వామి విమాన ప్రాకారం బంగారం తాపడం పనులు.. సంపూర్ణ పర్యవేక్షణ, సీసీ టీవీ కెమెరాల్లో నడుస్తోంది. ఒక్క గ్రాము బంగారం కూడా పక్కదారి పట్టేందుకు వీలు లేదు.. వీలు లేదు.. వీలు లేదు." - కోనేటి సుబ్బరాజు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జ్యువెల్లరీ సెక్షన్ 


వివాహ ఆహ్వాన పత్రిక అందజేసేందుకు వస్తే నానా యాగీ చేశారు..!


గోల్డ్ మలాం పనులు  చేసే కూలీలు విశ్రాంతి తీసుకునే ప్రదేశంలో బంగారు మలాం పనులు చేసే కాంట్రాక్టర్ జ్యోతికి వివాహ ఆహ్వాన పత్రిక అంద జేయడానికి ఒక ముస్లిం వ్యక్తి వచ్చారని టీటీడీ తెలిపింది. సదరు వ్యక్తులు ఈ సమయంలో అతన్ని పట్టుకుని నానా యాగీ చేశారని టీటీడీ వివరించింది. గోల్డ్ మలాం పనులకు అతనికి ఏ మాత్రం సంబంధం లేదని, అతనికి ఎలాంటి సబ్ కాంట్రాక్టు ఇవ్వలేదని టీటీడీ వెల్లడించింది. పబ్లిసిటీ  పిచ్చితో ఇలాంటి వ్యక్తులు చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేసిన సదరు వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది.