Salakatla Brahmotsavam 2022: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 7వ రోజు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2022 పురస్కరించుకుని బ్రేక్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవ టిక్కెట్లను టీటీడీ రద్దు చేస్తూ సర్వదర్శనం మాత్రమే టీటీడీ అమలు చేస్తుంది. ఏడుకొండల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం 02-10-2022 రోజున 82,463 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 35,385 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 2.31 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా కానుకలుగా సమర్పించారు. శ్రీవారి సన్నిధిలో భక్తుల తాకిడి పెరిగినా, ఆదివారం నాడు స్వామి హుండీకి కానుకలు, ఆదాయం భారీగా తగ్గిపోయిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 32 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా, స్వామి వారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది.  
ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు . ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు . 
సర్కారు హారతి తరువాత భక్తులకు దర్శనభాగ్యం
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం బ్రహ్మోత్సవాల్లో ఏడోవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు . అటు తరువాత ఉభయదేవేరులతో కలిసి మలయప్ప స్వామి వారిని విమాన ప్రాకారం‌ ప్రదక్షణగా కళ్యాణ మండపంకు వేంచేపు చేసి శ్రీవారి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అర్చకులు. 
అనంతరం ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహిస్తారు. అనంతరం రాత్రి చంద్రప్రభ వాహనంపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేయనున్నారు మలయప్ప స్వామి వారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు టీటీడీ అర్చకులు.