Tirupati Laddu Row: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి లడ్డూ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ విషయంలో నిర్ణయం చెప్పాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో కేంద్రం ఏం చెబుతుంది. సుప్రీంకోర్టు ఏం నిర్ణయిస్తుందనే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. అందుకే అందరి చూపు ఇవాళ సుప్రీంకోర్టు వైపు ఉంది. 


సంచలనంగా మారిన సుప్రీం కామెంట్స్ 


సెప్టెంబర్‌ 30 లడ్డూ వివాదంపై వచ్చిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రమణ్యం వేసిన పిటిషన్లు విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూ వివాదంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. 


కేంద్రం ఏం చెబుతుంది?


రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడమే కాకుండా ఈ విషయంలో ఏం చేస్తారో చెప్పాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. స్వతంత్ర దర్యాప్తు జరపాలా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌ దర్యాప్తు సరిపోతుందా అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. 


ఇంత వివాదం జరుగుతున్న వేళ కేంద్రం ఏం చెప్పబోతుందనే ఆసక్తి కూడా మరోవైపు ఉంది. స్వతంత్ర దర్యాప్తు జరపడానికి ఓకే చెబుతుందా.. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సిట్ దర్యాప్తు సరిపోతుందని దానికే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేదే తేలిపోనుంది. కేంద్రం ఏం చెప్పినా ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీరియస్ కామెంట్స్ చేసిన సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ లేకపోలేదు. 


మధ్యాహ్నం సుప్రీంలో విచారణ


తిరుమల లడ్డూ వివాదం కేసు విచారణ ఈ మధ్యాహ్నం 3.30కి రానుంది. దీన్ని జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వానాథన్‌ విచారిస్తారు. తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు కామెంట్స్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రమణ్యం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లు మొదటిసారి సెప్టెంబర్‌ 30 సోమవారం విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 


సీఎం కామెంట్స్‌ను తప్పు పట్టిన సుప్రీంకోర్టు 


రాజ్యాంగ పదవుల్లో ఉన్న సీఎం లాంటి వ్యక్తులు ఆధారాలు లేకుండా కామెంట్స్ చేయడమేంటని తప్పుపట్టింది సుప్రీంకోర్టు. దీంతో దేవుడి భక్తుల మనసులు గాయపడే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. కల్తీ అయిన నెయ్యి లడ్డూల్లో వాడలేదని ఈవో చెబుతుంటే సీఎం స్థాయి వ్యక్తి వాడినట్టు ఎలా చెప్పారని నిలదీసింది. సిట్ వేసే ఉద్దేశం ఉన్నప్పటికీ మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడారని ప్రశ్నించింది. కనీసం దేవుళ్లనైనా రాజకీయాల్లోకి లాగొద్దని హితువు పలికింది. 


సిట్‌కు తాత్కాలికంగా బ్రేక్


లడ్డూ వివాదంపై జరగుతున్న సిట్‌ దర్యాప్తునకు కూడా బ్రేక్ పడింది. సుప్రీంకోర్టు విచారణ ఉన్న వేళ రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న సిట్ దర్యాప్తును కూడా తాత్కాలికంగా నిలిపి వేసింది. సుప్రీం కోర్టు ఏం చెబుతుందో చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వ ఆలోచిస్తోంది. 


Also Read: తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ - దక్షిణాది హిందూత్వ నేతగా మరో అడుగు ముందుకేసినట్లేనా ?