Srikalahasti News: ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ ఆ అబ్బాయికి అప్పటికై పెళ్లి బాబు ఉండటంతో.. వారిద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఎవరికీ తెలియని చోట ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే తొమ్మిది నెలలుగా జంట కనిపించకుండా పోవడం.. ఇటీవల గ్రామంలోనే ఓ మహిళ, పురుషుడి మృతదేహాలు లభ్యం కావడంతో.. చనిపోయింది వారేనని అంతా భావించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రేమకుల జంట.. తాము క్షేమంగానే ఉన్నామంటూ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో స్థానికంగా వైరల్ గా మారింది. 


పెళ్లై, కుమారుడున్న యువకుడితో చంద్రిక ప్రేమాయణం!


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఠాగూర్, లలితల కుమార్తె చంద్రిత, శ్రీకాళహస్తి మండలం రామాపురానికి చెందిన చంద్రశేఖర్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. వాలంటీరుగా పని చేసే చంద్రశేఖర్ అప్పటికే వివాహితుడు. అతడికి సంతానం ఓ బాబు కూడా ఉన్నాడు. ఈ ఏడాది జనవరి 10వ తేదీన వీరిద్దరూ కలిసి ఇళ్లి వదిలి పెట్టి వెళ్లిపోయారు. కేబీపురం మండలం కోవనూరు సమీపంలో తెలుగు గంగ కాల్వలో ఈ నెల 20వ తేదీన బాగా ఉబ్బిన స్థితిలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యం అయింది. మృతదేహంపై పుట్టు మచ్చలను బట్టి చంద్రిత తల్లిదండ్రులు.. తమ కుమార్తేనని తెలిపారు. తమ బిడ్డ చావుకు కారణం అయిన చంద్రశేఖర్ ను శిక్షించాలంటూ డిమాండ్ చేయగా.. వారికి అండగా టీడీపీ, జనసేన నేతలు పోలీస్ స్టేషన్ల వద్ద రెండ్రోజులు ధర్నాలు చేశారు. 


22వ తేదీన బండమానుకాల్వ వద్ద మృతదేహం లభ్యం..


ఇంతలో ఏర్పేడు మండలం అంజిమేడు సమీపంలోని బండమానుకాల్వ వద్ద ఈనెల 22వ తేదీన ఓ యువకుడి మృతదేహం లభ్యం అయింది. పోలీసులు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. వారు చూసేందుకు రాలేదు. చంద్రిత తల్లిదండ్రులను పిలిపించగా.. ఆ మృతదేహం చంద్రశేఖర్ దేనని వాళ్లు తేల్చి చెప్పారు. పోలీసులు అనుమానంతో డీఎన్ఏ పరీక్షలు చేయించాలంటూ రెండు మృతదేహాలను శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికీ మార్చురీలోనే ఉంచారు. చంద్రిత తల్లిదండ్రులు కూడా తమకు న్యాయం జరిగే వరకూ శవాన్ని తీసుకెళ్లమని భీష్మించారు. అయితే ఇందుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అయింది. అది చంద్రశేఖర్, చంద్రితలకు సంబంధించినది. అంతలోనే ఆ జంట ట్విస్ట్ ఇచ్చింది.


మేం బాగున్నామంటూ చంద్రిక, చంద్రశేఖర్ సెల్ఫీ వీడియో..


మేం బాగున్నం. త్వరలోనే రామాపురానికి వస్తున్నాం. మాపై వస్తున్నవన్నీ పుకార్లే. మేం సంతోషంగా ఉన్నాం. అంటూ చంద్రశేఖర్, చంద్రితలు ఓ సెల్ఫీ వీడియో పంపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ కేసు విచారిస్తున్న పుత్తూరు గ్రామీణ సీఐ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. అనుమానాస్పదంగా బయటపడిన రెండు మృతదేహాలతు తమకు అనుమానం ఉందనే డీఎన్ఏ పరీక్షకు పంపినట్లు తెలిపారు. అంత్యక్రియలు చేయలేదని పేర్కొన్నారు. ఆ నివేదికలు వస్తే మృతులు ఎవరో తేలుతుందని వివరించారు.