పుంగనూరు, అంగళ్లు హింసాత్మక ఘటన కేసులు మరో మలుపు తిరగాయి. ఇందులో ఏ1 గా టీడీపీ అధినేత చంద్రబాబును చేరుస్తూ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆయనతోపాతు ఏ2గా దేవినేని ఉమామహేశ్వరరావు, ఏ3గా అమర్‌నాథ్ రెడ్డిని చేర్చారు. అన్నమయ్య జిల్లా ముదివీడు పీఎస్‍లో కేసు నమోదు చేశారు. చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు. 


ఈ నెల 4న చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పర్యటన సందర్భంగా ఘర్షణ జరిగింది.  అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు వద్ద జరిగిన అల్లర్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన అల్లర్లపై పోలీసులుకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులతో కేసులు నమోదు చేసిన పోలీసులు చంద్రబాబుతోపాటు టీడీపీ లీడర్లను నిందితుల జాబితాలో చేర్చారు.


అన్నమయ్య జిల్లా ముదివేడులో ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్ చేసిన పోలీసులు ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమరనాథ్ రెడ్డి, ఏ4గా చల్లా బాబుపై కేసు నమోదు చేశారు. అయితే ప్రాజెక్టుల సందర్శన పేరుతో టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు ప్రసంగించారంటూ ఏఫ్ఐఆర్‌లో పోలీసులు నమోదు చేశారు.


మంగళవారం రాత్రి ముదివేడు పోలీసుల స్టేషన్‌లో ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమా, ఏ3గా అమర్‌నాథ్ రెడ్డి, పులివర్తి నానితో పాటుగా మరికొంత మంది టిడిపి‌ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు. 


ఉమాపతిరెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈనెల 4న మారణాయుధాలు, ఐరన్‌ రాడ్లు, ఇటుకలు, కర్రలు వంటి వాటితో ప్రయాణిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఉమాపతిరెడ్డి. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసిన పోలీసులు 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం, 120బీ సెక్షన్ కింద నేరపూరిత కుట్ర చేసినట్టు అందులో పేర్కొన్నారు. 


అంగళ్లు, పుంగనూరు అల్లర్ల కేసులో మొత్తం 245 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా, ఇందులో ఇప్పటి వరకూ 74 మందిపై పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ అల్లర్లకు టిడిపి నాయకులే కారణమంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లా టిడిపి నేతలైనా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, చల్లా బాబు(రామచంద్రారెడ్డి), పులివర్తి నానిపై కేసులు నమోదు చేశారు.


మొత్తం ఇప్పటి వరకూ ఏడు చార్జ్‌షీట్‌లు నమోదు చేయగా ఇందులో ప్రధాన నిందితుడిగా ఏ1 ముద్దాయిగా చల్లాబాబు అలియాస్ రామచంద్రారెడ్డిని చేర్చారు. మంగళవారం రోజు మరో రెండు కేసులు నమోదు చేశారు. చిత్తూరు సిసిఎస్ కానిస్టేబుల్ ఆర్ లోకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుంగనూరు టిడిపి ఇంచార్జ్ చల్లాబాబుతోపాటు చౌడేపల్లి, పులిచెర్ల మండలాలతోపాటు అన్నమయ్య జిల్లా, రాజంపేటకు చెందిన 47 మందిపై కేసులు నమోదు చేశారు.


అనంతపురానికి చెందిన మరో ఏఆర్ కానిస్టేబుల్ రణధీర్ ఫిర్యాదు మేరకు చల్లా బాబుతో పాటు, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి నియోజవర్గానికి సంబంధించిన 39 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో మొత్తం కేసుల సంఖ్య 7కు చేరుకుంది. మొత్తం 7 కేసుల్లో ఏ 1గా పుంగనూరు టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పై ఎఫ్ఐఆర్ దాఖలైన క్రమంలో మొత్తం 7 కేసుల్లో 246 మంది టీడీపీ శ్రేణులపైన కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటి వరకు 74 మందిని అరెస్ట్ చేసి, అందులో 61 మందిని కడప సెంట్రల్ జైలుకు తరలించగా, మిగిలిన వారిని చిత్తూరు సబ్ జైలులో ఉంచారు.