Parveta Mandapam In Tirumala:

  తిరుపతి: తిరుమల (Tirumala)లో పార్వేట మండపం పునరుద్ధరణ వివాదంపై టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) స్పందించారు. తిరుపతిలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో ఇటీవల జీర్ణోద్ధరణ చేసిన పార్వేట మండపంపై కేవలం ఒక వ్యక్తి చేసే ఆరోపణలు మాత్రమేనంటూ కొట్టి పడేశారు. ప్రాచీన, పురాతన మండపాలను కూల్చివేసి అస్తవ్యస్తంగా చేసే ఆలోచన టీటీడీ (TTD) చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. భక్తుల్లో సందేహాలు తీసుకుని వచ్చేందుకు కొందరు చేస్తున్న కుట్ర అని, శిథిలావస్థలో ఉన్న పార్వేట మండపాన్ని (Parveta Mandapam) జీర్ణోద్ధరణ చేసి కొత్త మండపంను అద్భుతంగా తీర్చి దిద్దామని చెప్పారు. 


ఇక పాత మండపంలోని శిల్ప స్తంభాలను అలాగే నూతనంగా నిర్మించిన పార్వేట మండపంలో ఉంచామన్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద 2 విశ్రాంతి మండపాలు ఉండగా, అందులో కుడివైపు ఉన్న విశ్రాంతి మండపం శిథిలావస్థకు చేరుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పురాతన మండపాన్ని కూల్చి ఆ పురాతన మండపంలోని స్ధానంలో రాతి స్తంభాల సహాయంతో తిరిగి నూతనంగా మండపంలో జీర్ణోదరణ చేసేందుకు టీటీడీ యోచిస్తుందని ధర్మారెడ్డి తెలిపారు. నిజంగా పురావస్తు శాఖ అనుమతులు అవసరమా అంటూ ఆరా తీశామని, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్టేట్ ఇంచార్జ్ డాక్టర్ జానాతో తాను స్వయంగా మాట్లాడినట్లు తెలిపారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న మండపాలు ఆలయాలను మాత్రమే తాము నిర్మిస్తామని, మా పరిధిలోని మండపాలు మాకు సంబంధం లేదంటూ డాక్టర్ జానా తెలియజేసినట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 


టీటీడీ పరిధిలో ఉన్న రెండు ఆలయాలు మాత్రమే పురావస్తు శాఖ పరిధిలోకి వస్తుందని, అందులో మొదటిది శ్రీనివాస మంగాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం, మరొకటి ఒంటిమిట్ట శ్రీరాముని ఆలయం మాత్రమే తమ పరిధిలో ఉందని ఆర్కియాలజీ అధికారులు తెలియజేసినట్లు చెప్పారు.. పునర్నిర్మాణం చేయాలని ఆలోచనకు వస్తే ఆ ప్రాచీన కట్టడాల్లోని రాతి మండపాలన ఉపయోగించి అదే విధంగా నూతన నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు. ఓ వ్యక్తి అయితే టీటీడీ చేస్తున్నది తప్పు అని అంటున్నారు, ఆయన చెప్పినట్లే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వచ్చి మండపాలు నిర్మిస్తే టీటీడీకి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. 2019 నుంచి సుమారుగా శ్రీవాణి ట్రస్టు ద్వారా 1600 ఆలయాలను నిర్మించారు, మరికొద్ది రోజుల్లో 2 వేల దేవాలయాలను నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. అనేక ఆలయాలను పునఃనిర్మాణం చేసిందని, అలాంటి ఆలయాల్లో ఎక్కడ ఇబ్బంది తలెత్తలేదని, కొందరు వ్యక్తులు టిటిడిపై ఎందుకు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. 


ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో సంప్రదించి మండపాలను నిర్మిస్తామంటే వారికి అందజేస్తామని చెప్పారు. ఆలయంను పూర్తిగా పునరుద్ధన చేశాం, వకుళామాత ఆలయం కూడా ఆరోపణలు చేసే వ్యక్తులు పరిశీలించవచ్చని, స్వార్థం కోసం మండపాలను టీటీడీ లోని అధికారులు నిర్మిస్తారా అని ఆయన ప్రశ్నించారు. శ్రీవారి భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలను తీసుకుంటూ మండపాలను నిర్మించామని, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు లేఖను సైతం టీటీడీ రాసిందని ఈవో తెలిపారు. ఇక అలిపిరి నడక మార్గంలో నిరంతరాయంగా నిఘా ఉంచామని, నవంబర్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు చిరుత, ఎలుగుబంటి సంచారం జరగలేదని కాలిబాట మార్గంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంక్షలు అమలు చేస్తూ జాగ్రత్త చర్యలు తీసుకున్నామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు.