వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే, అదృష్టవశాత్తూ చివరికి ఎలాంటి అపాయం జరగకుండా అందరూ విమానం నుంచి బయటికి వచ్చారు. రాజమండ్రి నుంచి తిరుపతికి వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. తిరుపతి ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సాధ్యం కాక ఇండిగో ఫ్లైట్ దాదాపు గంట సమయం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ విమానంలోనే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు, వైసీపీ ఎమ్మెల్యే రోజా రాజమండ్రిలో ఈ విమానం ఎక్కారు. తిరుపతికి రావాల్సిన ఈ విమానాన్ని బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసినట్లు సమాచారం. వాతావరణ సమస్యా లేక సాంకేతిక సమస్య ఏదైనా తలెత్తిందా అనే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.


ఈ వ్యవహారంపై ఇండిగో సిబ్బంది సమాధానం చెబుతున్న తీరుపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విమానం నుంచి బయటకు వచ్చేందుకు ఇండిగో సిబ్బంది ప్రయాణికుల నుంచి అదనపు రుసుము డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. యాజమాన్యం తప్పిదానికి తాము ఎందుకు డబ్బులు కట్టాలని ప్రయాణికులంతా మండిపడ్డారు. బెంగళూరు నుంచి గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు సొంత ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.


ఈ సాంకేతిక లోపం విషయంపై ఎమ్మెల్యే రోజా సహా ఇతర ప్రయాణికులు స్పందించారు. ఈ మేరకు వీడియోలు విడుదల చేశారు. విమానం సేఫ్‌గానే ల్యాండ్ అయిందని వారు తెలిపారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల ఫ్లైట్‌ను బెంగళూరుకు మళ్లించినట్లుగా ఇండిగో సంస్థ ప్రతినిధులు చెబుతున్నారని ప్రయాణికులు అంటున్నారు. సాంకేతిక లోపం ఉంది అని తెలుసుకున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. అయితే, బెంగళూరులో విమానం ల్యాండ్ అయ్యాక కూడా విమానం డోర్ తెరవకుండా సిబ్బంది రూ.5 వేలు డిమాండ్ చేశారంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని రోజా సెల్ఫీ వీడియోలో అన్నారు.


ఫ్లైట్ అంతా ఊగిపోయింది: రోజా
‘‘రాజమండ్రిలో పొద్దున 9.20కి విమానం ఎక్కాం. తిరుపతిలో 10.30 దిగాల్సి ఉంది. కానీ, తిరుపతి చుట్టుపక్కలే దాదాపు గంట సేపు గాల్లోనే చక్కర్లు కొట్టారు. ఆ టైంలో ఫ్లైట్ అంతా ఊగిపోయింది. ఏంటని అడిగితే క్లౌడ్స్ ఉన్నాయని చెప్పారు. తర్వాత ఫ్యుయల్ అయిపోతుందని బెంగళూరుకు ఫ్లైట్ మళ్లించినట్లుగా చెప్పారు. ఇక్కడ ల్యాండ్ అయ్యాక కూడా విమానం తలుపులు తెరవలేదు. ఇటీవలే నాకు ఆపరేషన్ జరిగింది. కూర్చోలేమని చెప్పినా ఇండిగో సిబ్బంది వినలేదు. దాదాపు నాలుగు గంటలు దాటింది. కిందికి దిగాలంటే రూ.5 వేలు కట్టాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల్ని మానసికంగా ఇబ్బంది పెట్టిన ఇండిగోపై మేం కోర్టుకు వెళ్తాం.’’ అని ఎమ్మెల్యే రోజా సెల్ఫీ వీడియో విడుదల చేశారు.


Also Read: మూడు రాజధానులే కావాలంటూ తిరుపతిలో ఫ్లెక్సీలు.. వైఎస్ఆర్‌సీపీ నేతల పనేనని అమరావతి రైతుల ఆరోపణ !


Also Read:  కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ .. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం


Also Read: "హోదా" కోసం రాజీనామాలు చేద్దాం ..రా ! సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి