అభిమానం ఎంత పనైనా చేయిస్తుంది అంటారు. అందులోనూ తమ అభిమాన వ్యక్తులు, నటీనటులను చూస్తే ఫ్యాన్స్ ఏం చేస్తారో కూడా కొన్నిసార్లు ఊహించలేం. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నటులను కలిసేందుకు ప్రయత్నిస్తారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఇలాంటి ఘటనే జరిగింది. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కలిసేందుకు ఓ అభిమాని ఏకంగా నదిలో దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


అసలేం జరిగిందంటే.. 
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాయలసీమలో పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోనూ కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతి పెరిగి కొన్నిచోట్ల లోతట్లు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెరువు కట్టలు, చిన్న చిన్న వాగులు తెగిపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం మండలం పోచనపల్లి వద్ద తెగిపోయిన వంతెనను పరిశీలించడానికి వెళ్లారు. ఆయన వంతెనను పరిశీలిస్తున్న సమయంలో తెగిపోయిన వంతెన అవతలిపైపు ఉన్న ఓ అభిమాని ఎలాగైనా బాలయ్యను కలుసుకోవాలనుకున్నాడు. 






నదిలో దూకిన అభిమానం !
ఆ సమయంలో వరద ఉధృతి కొనసాగుతున్నా, లెక్కచేయకుండా నటుడు బాలకృష్ణ ఫ్యాన్ పెన్నా నదిలో దూకేశాడు. అవతలి వైపు ఉన్న బాలయ్యతో పాటు అక్కడున్న వారంతా వద్దు వద్దు అని వారిస్తున్నా వినిపించుకోకుండా ఆయన వీరాభిమాని అంతా చూస్తుండగానే నదిలో దూకాడు. ఆ తరువాత ఈదుకుంటూ అవతలి గట్టుకు చేరుకున్నాడు. కొట్టుకుపోతాడేమో బాలయ్యతో పాటు అక్కడున్న వారు భావించారు. కానీ ఈ రావడంతో ఈదుకుంటూ సురక్షితంగా నటుడు ఉన్న గట్టు వైపు చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇటీవల అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభించారు బాలయ్య. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్ లు తొలి ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి సందడి చేశారు. పలు కీలక విషయాలపై ఈ ఎపిసోడ్ లో బాలయ్య, చంద్రబాబు చర్చించడంతో ఓ రేంజ్ లో సక్సెస్ అయింది. సినిమాల విషయానికొస్తే.. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న బాలకృష్ణ మూవీ సంక్రాంతికే రాబోతుందని టాక్. ఇటీవలే టర్కీలో 40 రోజుల పాటు బాలయ్య సినిమా షూటింగ్ ను నిర్వహించారు. రీసెంట్ గానే టీమ్ ఇండియాకు వచ్చింది. సంక్రాంతికి ఎక్కువ సినిమాలు విడుదల అవ్వడం సహజమే కానీ ఈసారి భారీ బడ్జెట్ సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి.చిరంజీవి, బాలయ్య సినిమాలను నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. ఒకేసారి తమ బ్యానర్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ చేయడం వారికి ఇష్టం లేదు కానీ ఈసారి వారి చేతుల్లో ఏమీ లేదని అంటున్నారు. చిరు, బాలయ్యల ఇద్దరూ మాట్లాడుకొని ఒకరి సినిమాను డిసెంబర్ లో, మరొకరి సినిమా సంక్రాంతికి విడుదలయ్యేలా చూసుకోవాలి అని సూచిస్తున్నారు.